హైదరాబాద్, మార్చి 12 : హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐకియా వెనుక భాగంలో రాష్ట్రప్రభుత్వం కేటాయించిన భూమిలో ఐఏఎంసీ శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతో కలిసి జస్టిస్ రమణ శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికే గుండెకాయ లాంటి ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎంసీకి ఇచ్చిందని తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు ఇవ్వటం గొప్ప విషయమని ప్రశంసించారు. ఐఏఎంసీ శాశ్వత ఏర్పాట్లలో ఇది కీలక ఘట్టమన్నారు. ఆర్బిట్రేషన్ ఉద్యమంలో మహత్తర చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు.
ఏడాదిలోపే పూర్తి వసతులు
వచ్చే ఏడాది నాటికి ఐఏఎంసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తుందని, అందుకోసం అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. నగరంలో తాత్కాలిక భవనంలో రెండు నెలలుగా పనిచేస్తున్న ఐఏఎంసీకి మంచి ఆదరణ లభిస్తున్నదని, శాశ్వత భవనాలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తే ఐఏఎంసీకి తిరుగే ఉండదని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో దుబాయ్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ, రాజీ, పరిషార కేంద్రాల నిపుణులతో సదస్సు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా హైదరాబాద్ ఐఏఎంసీకి కూడా మంచి గుర్తింపు లభిస్తుందని చె ప్పారు. హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటు ప్రతిపాదన చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిధుల కేటాయించిందని కొనియాడారు. ఐఏఎంసీ ఏర్పాటులో సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ తదితరుల సహకారం ఎనలేనిదని ప్రశంసించారు.
ఐఏఎంసీకి ఆదరణ: జస్టిస్ నాగేశ్వర్రావు
హైదరాబాద్లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ఐఏఎంసీకి మంచి ఆదరణ లభిస్తున్నదని సెంటర్ ట్రస్టీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు సిఫారసుచేసిన కేసులే కాకుండా కక్షిదారులు స్వయంగా ఐఏఎంసీలో ద్వారా కేసుల రాజీ కోసం వచ్చారని వెల్లడించారు. సింగపూర్ నుంచి కూడా కేసులు వచ్చాయని, ఇకడి రాజీ విధానంపై కక్షిదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రపంచస్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాలకు దీటుగా హైదరాబాద్ ఐఏఎంసీ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఐఏఎంసీ సీఈవో సితేశ్ ముఖర్జీ, సీఎస్ సోమేశ్కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.