Civils Coaching | హైదరాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్కై దరఖాస్తు చేసుకున్న వారు రేపట్నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కోచింగ్ నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 3,405 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులందరికీ రాతపరీక్షను సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్డులోని యూనివర్సిటీ పీజీ కాలేజీ, దోమల్గూడలోని ఏవీ కాలేజీ, నాంపల్లిలోని సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ, కోఠి ఉమెన్స్ కాలేజీలో, వరంగల్ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నిజామాబాద్లోని గవర్నమెంట్ గిరిరాజ్ కళాశాలలో జూలై 9వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
రాతపరీక్షను మొత్తం 140 ప్రశ్నలతో నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు, సి-శాట్ నుంచి 40 ప్రశ్నలతో కలిపి పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు మూడు గంటల సమయం ఇవ్వనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటలకే అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఓఎంఆర్ షీట్ నింపేందుకు కేవలం బ్లాక్ బాల్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం www.tsstudycircle.co.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చని డైరెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.