హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అందరూ అండగా నిలవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి మిల్లర్లుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ధాన్యం అన్లోడింగ్కు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి పంపిన ధాన్యాన్ని దింపుకోవాల్సిందేనని మిల్లర్లకు సూచించారు. ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యను సామరస్యంగా పరిషరించిన మంత్రికి మిల్లర్లు ధన్యవాదాలు తెలిపారు.
క్షేత్రస్థాయిలోని సమస్యలను మిల్లర్లు ఈ సందర్భంగా మంత్రికి విన్నవించారు. పదే పదే తడిసిన ధాన్యం మిల్లింగ్కు పనికిరావడం లేదని, నూక శాతం పెరగడంతోపాటు రంగుమారుతున్నదని తెలిపారు. దానిని కేంద్రం ఆమోదించకపోవడం తో నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. మంత్రి స్పందిస్తూ.. కనీస నాణ్యతా ప్రమాణాల (ఎఫ్ఏ క్యూ)ను సడలించాలని మరోసారి కేంద్రానికి విజ్ణప్తిచేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయం తో ఉన్నారని స్పష్టంచేశారు.
ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులెదురైనా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నదని, రోజుకు సగటున లక్ష టన్నులకుపైగా కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సోమవారం ఏకంగా 1.61 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,087 కేంద్రా ల ద్వారా 1.07 లక్షల మంది రైతుల నుంచి 3,161 కోట్ల విలువైన 15.38 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టయిందని వివరించారు. నిరుడు ఇదే సమయానికి 8 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. సమీక్షలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, కమిషనర్ అనిల్కుమార్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.