కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. శుక్రవారం ఆయన కరీంనగర్లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్, జీఎం రాజారెడ్డి తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వర జలాలతో సాగు విస్తీర్ణం ఏ యేటికాయేడు పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. చివరి ధాన్యం గింజ వరకూ మద్దతు ధరతో కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి 20 ఏండ్ల కనిష్టానికి పడిపోతున్నదని, అదే తెలంగాణలో మాత్రం ఇందుకు భి న్నంగా బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందని స్పష్టం చేశారు.
ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనతగా భావించాల ని అన్నారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రూ.186 కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. అత్యధికంగా నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు జరిగినట్టు చెప్పారు. కోతలకు అనుగుణంగా కేం ద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణ యం తీసుకుంటుందని, లక్ష్యం మేర సేకరణకు అవసరమైన 7,031 పైచిలుకు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్, వేయింగ్ మెషిన్లు, హమాలీలను సమకూర్చుకున్నామని వివరించారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.