Ration Card KYC | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డు కేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో పేరు తొలగిస్తారనేది పూర్తిగా దుష్ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
రేషన్ లబ్ధిదారుల కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేయగా, తెలంగాణ పౌరసరఫరాల సంస్థ జనవరి వరకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో మాత్రం అసత్య ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఇప్పటికే స్పందించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కేవైసీ ప్రక్రియను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రేషన్ కార్డుల్లో పేర్లున్నవారు చాలా మంది ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నారని, కేంద్రం నిబంధనతో వారందరికీ ఇబ్బంది అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.