Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టెండర్లలో విక్రయించిన ధాన్యం పరిస్థితి చూస్తుంటే ఓ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తున్నది. టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు తరలించేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి. మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలంలో విక్రయిస్తే ఇప్పటి వరకు ఎత్తింది 5 వేల టన్నులే. దీనివెనక కూడా మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. ఎక్కడ ధాన్యం అక్కడ ఉండగానే ‘వ్యాపారం’ పూర్తిచేసే ఆలోచనలో ఆయా సంస్థలు ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం మిల్లర్లతో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ధాన్యం విక్రయించి ఆర్థిక లోటును పూడ్చుకుందామనుకున్న పౌరసరఫరాల సంస్థకు సంస్థల తీరుతో నిరాశే ఎదురవుతున్నది. ఇటు ధాన్యం ఎత్తక, అటు డబ్బులు రాక, మరోవైపు మిల్లుల్లో చోటు లేక పౌరసరఫరాల సంస్థ పరిస్థితి గందరగోళంగా మారింది. పౌరసరఫరాల సంస్థ 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే.
ఓ జిల్లాలో 1.75 లక్షల టన్నుల ధాన్యాన్ని టెండర్లలో ఓ సంస్థ దక్కించుకున్నది. ఇందులో 499 టన్నులను ఎత్తేందుకు మార్చి 15న ఆర్వో(రిలీజ్ ఆర్డర్) తీసుకున్నది. ఇందుకోసం సుమారు రూ. కోటి చెల్లించింది. ఇప్పటికి నెల రోజులు దాటుతున్నా 100 టన్నులు మాత్రమే తరలించి ఊరుకుంది. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా 35 లక్షల టన్నుల్లో 5 వేల టన్నులు మాత్రమే తరలించినట్టు తెలిసింది. 5 వేల టన్నుల తరలింపునకే అంత సమయం తీసుకుంటే మిగిలిన ధాన్యం తరలింపు ఎప్పుడు పూర్తవుతుందన్న సందేశాలు నెలకొన్నాయి.
టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు, వ్యాపారులు ఆ ధాన్యాన్ని ఎత్తకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణి నడుస్తున్నట్లు తెలిసింది. ధాన్యానికి బయట డిమాండ్ తగ్గడంతో ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తే రవాణా ఖర్చులు మీదపడే అవకాశం ఉందని, దీనిని తప్పించుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’ రచించినట్టు సమాచారం. లోడెత్తకుండానే ‘పని’ పూర్తిచేసేందుకు మిల్లర్లతో బేరసారాలు సాగిస్తున్నట్టు తెలిసింది. మిల్లర్ల వద్దనున్న ధాన్యాన్ని వారు ఉంచుకొని ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం.టెండర్లలో కొనుగోలు చేసిన ధరకు అదనంగా క్వింటాలకు రూ. 200-250 వరకు ఇస్తే సరిపోతుందని ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. మిల్లర్లు రూ. 100 ఇచ్చేందుకు సిద్ధం కాగా, వ్యాపారులు మాత్రం అది సరిపోదని చెప్తున్నట్టు సమాచారం.
టెండర్లలో ధాన్యం దక్కించుకున్న సదరు సంస్థలు కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన నాటినుంచి 90 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని ఎత్తేయాలని పౌరసరఫరాల సంస్థ టెండర్ నిబంధనల్లో పేర్కొంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23న ఆయా సంస్థలకు టెండర్ కన్ఫర్మేషన్ లెటర్లు జారీచేసింది. ఈ లెక్కన ఇప్పటికే 50 రోజులు పూర్తయింది. ఇక మిగిలింది 40 రోజులే. ఈ నేపథ్యంలో మిగిలిన 40 రోజుల్లో 34.95 లక్షల టన్నులు ఏ విధంగా ఎత్తగలుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తాన్ని ఎత్తాలంటే 1.2 లక్షల లారీ లోడ్లు అవుతాయని చెప్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. టెండర్ల సమయంలో వ్యాపారులు సగటున క్వింటాలుకు రూ. 2 వేల చొప్పున వెచ్చించారు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర రూ. 2300 వరకు పలికింది. ఆ తర్వాత కూడా అదే డిమాండ్ కొనసాగుతుందని వ్యాపారులు భావించారు. ఇప్పుడు కొత్త ధాన్యం రావడంతో డిమాండ్ తగ్గిపోయింది. గతంలో ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు ఇప్పుడు కొత్త ధాన్యం కొనుగోలు చేసి ఆ లోటును భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 2,060 మద్దతు ధరతో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ లెక్కన 35 లక్షల టన్నుల ధాన్యానికి రూ. 7,125 కోట్లు వెచ్చించింది. దీనికి అదనంగా నిల్వ, తరలింపు ఇతర ఖర్చులు కలిపి క్వింటాలుకు రూ. 250 వరకు అయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారీగా ఆర్థిక భారం పడింది. ధాన్యాన్ని విక్రయించడం ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చని భావించింది. వీటిని విక్రయించడం ద్వారా సుమారు రూ. 7 వేల కోట్లను సమకూర్చుకోవాలని భావించింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ధాన్యం పైసలు సివిల్ సైప్లెకి వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.