హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సివిల్ సర్వీసెస్(మెయిన్స్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 2,736 మంది అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరంతా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)కు ఎంపికైనట్టు యూపీఎస్సీ తెలిపింది. ఆగస్టు 22 నుంచి 31 వరకు జాతీయంగా ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల పేర్లు, హాల్టికెట్ నంబర్లను యూపీపీఎస్సీ బుధవారం వెబ్సైట్లో విడుదల చేసింది.
డిసెంబర్లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన 150 మంది అభ్యర్థులు ఉంటారని పోటీ పరీక్షల శిక్షకురాలు బాలలత తెలిపారు. ఈ ఫలితాల్లో సింగరేణి సంస్థ ద్వారా అందిస్తున్న రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం లబ్ధిదారులు 43 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన 202 మంది తెలంగాణ అభ్యర్థులకు తలా రూ. లక్ష చొప్పున సింగరేణి ఆర్థిక సహాయం చేసింది.
వీరిలో 43 మంది ఎంపికకావడం గర్వకారణమని సంస్థ సీఎండీ బలరాం నాయక్ పేర్కొన్నారు. నిరుడు 140 మంది ప్రిలిమ్స్కు అర్హత సాధించగా, 20 మంది మెయిన్స్కు ఎంపికయ్యారని తెలిపారు. తాజాగా మెయిన్స్కు ఎంపికైన వారికి తలా రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తామని బలరాం వెల్లడించారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.
సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయంసాధించిన 43 మంది విజేతలను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం సాయం అందుకుని విజేతలుగా నిలిచారని గుర్తుచేశారు. ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేందుకు మరో లక్ష ప్రోత్సాహకం అందించనున్నామని తెలిపారు.