రఘునాథపాలెం, మార్చి 7 : ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. చిన కమిటీ భూదాన్ బాధితులను కలిసి వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు, కోశాధికారి విప్లవకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగానే పేదల ఇండ్లను కూల్చినట్టు నిర్ధారణ అయ్యిందని అన్నారు. నిర్వాసిత ప్రజలకు తిరిగి వెలుగుమట్ల వినోభానగర్ కాలనీలోనే పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన్ బోర్డు జారీచేసిన పత్రాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.