హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఏపీ, హర్యానాలో ముగ్గురు నిందితులతో సంబంధాలున్న వారి ఇండ్లు, కార్యాలయాల్లో సిట్ ప్రత్యేక బృందాలు శని, ఆదివారాల్లో సోదాలు చేశాయి. నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, సింహయాజి, నందకుమార్ సిట్ విచారణలో తెలిపిన వివరాల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి.
వారు ఇతర రాష్ర్టాల్లోని కొందరితో ఫోన్, వాట్సప్, ఈమెయిల్లో సంప్రదింపులు జరిపారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులకు చెందిన ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపినట్టు తెలిసింది. తొలుత హైదరాబాద్ బంజారాహిల్స్లోని హిల్టాప్ అపార్ట్మెంట్, చైతన్యపురిలోని నందకుమార్ నివాసంతోపాటు ఫిల్మ్నగర్లోని హోటల్ డెక్కన్ కిచెన్ హోటల్లో సోదాలు జరిపిన సిట్ బృందాలు ఆ తరువాత దేశవ్యాప్తంగా సోదాలు ప్రారంభించాయి. తిరుపతిలో సింహయాజికి చెందిన ఆశ్రమం, హర్యానా, కర్ణాటకలో రామచంద్రభారతి నివాసాలలో సోదాలు జరుపుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రామచంద్రభారతికి కేరళలోని కొచ్చికి చెంది న వైద్యుడు జగ్గు స్వామీ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు గుర్తించిన సిట్, అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీ నం చేసుకొన్నట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన మంత్రి, ఒక ఎమ్మెల్యేతో నిందితులు చాలాసార్లు మాట్లాడినట్టు గుర్తించింది. హర్యానా,ఢిల్లీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో వెల్లడైంది.
శేరిలింగంపల్లి/బంజారాహిల్స్, నవంబర్ 13: కమల్ఫైల్స్ వ్యవహారంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావు ఇచ్చిన ఫిర్యాదులతో వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గువ్వల బాలరాజు గచ్చిబౌలి ఠాణాలో, పైలట్ రోహిత్రెడ్డి రాయదుర్గం ఠాణాలో, హర్షవర్ధన్రెడ్డి బంజారాహిల్స్ ఠాణాలో, రేగా కాంతారావు ఘట్కేసర్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గత వారం రోజులుగా తమకు ఫోన్లు చేసి కేసు వెనక్కితీసుకోవాలని, లేదంటే మీ అంతుచూస్తామని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.