జ్యోతినగర్, ఆగస్టు 22: న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ బలగాలు దాష్టీకం ప్రదర్శించాయి. లాఠీలు విరిగేలా చావబాదడంతో 70 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారసత్వ ఉద్యోగాల అమలు, సీనియర్ కార్మికులు, ఐటీఐ అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతి తదితర డిమాండ్లపై సోమవారం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ లేబర్గేట్లో సమావేశమయ్యారు. అనంతరం నిరసన తెలిపేందుకు ప్లాంట్ గేట్వైపు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని, కార్మికులపై లాఠీచార్జి చేశాయి. ఆగ్రహానికి గురైన కార్మికులు రాళ్లు విసిరారు. లాఠీచార్జిలో గాయపడిన కార్మికులను గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులను పరామర్శించారు. కార్మికులపై లాఠీచార్జి దుర్మార్గమైన చర్య అని, ఈ ఘటనను సీఎం కేసీఆర్, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్మికులు కోలుకునే వరకు వేతన మాస్టర్లు చెల్లించాలని జేఏసీ నాయకులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీచార్జి చేయడం అమానుషమని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వరర్స్ యూనియన్ (ఎస్సీసీడబ్ల్యూ), ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.