హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినీ ఫక్కీలో దుండగులు ఓ కారును వెంబడించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. అనంతరం దోచుకెళ్లిన సొమ్మును, కారును కొంతదూరంలో వదిలి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే… శనివారం రాత్రి నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు నంద్యాల నుంచి తన గ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్పోస్టుకు సమీపంలో ఆరుగురు దుండగులు వీరి కారును ఆపి, అద్దాలను ధ్వంసం చేశారు.
వ్యాపారులపై దాడి చేసి, రూ.45 లక్షల నగదు, 950 గ్రాముల బంగారంతో సహా కారును ఉడాయించారు. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లిన దుండగులు గిద్దలూరు మండలం కే ఎస్ పల్లె వంతెన వద్ద కారుతోపాటు నగదును, బంగారాన్ని వదిలివెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు గిద్దలూరు పోలీసులు కారును తనిఖీ చేశారు. దీంతో కారు లాకర్లో దాచిన నగదు, బంగారం సురక్షితంగా బయటపడింది. దుండగుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.