హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని పండుగులను అంగరంగవైభవంగా నిర్వహిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నది. బతుకమ్మ, రంజాన్ను పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న క్రమంలోనే ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా కూడా క్రైస్తవులకు దుస్తులు, గిఫ్ట్ ప్యాక్లను క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పంపి ణీ చేస్తున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు కూడా ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గిఫ్ట్ ప్యాక్లలో తల్లికి చీర, తండ్రికి ప్యాంటు, షర్ట్, కూతురుకు పంజాబీడ్రెస్ అందజేయనున్నారు.
ప్రతి చర్చి పరిధిలో 500 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను అందజేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 200 ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మతపెద్దల ఆధ్వర్యంలో నోడల్ చర్చిలను గుర్తించి, ప్రతి చర్చి పరిధిలో 500 మందికి దుస్తులు పంపిణీ చేయనున్నారు. అదే రోజున విందు కూడా ఏర్పాటుచేయనున్నారు. జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల మార్గదర్శకత్వంలో దుస్తుల పంపిణీ, విందు ఏర్పాటు చేయనున్నారు. విందు భోజనానికిగాను జిల్లాలలో నియోజకవర్గానికి రూ.2 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో ప్రాంతానికి లక్ష చొప్పున ఖర్చు చేయనున్నారు.
హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నది. ఈ ఏడాది సైతం డిన్నర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వేడుకలకు సీ కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మతపెద్దలతో కలిసి క్రైస్తవ ప్రార్ధనల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో 30 ఏండ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న క్రైస్తవ సంస్థలకు విశిష్ట గౌరవపురసారాలను, నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నారు.