హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని, అది నిజమైందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. ‘నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ ధ్యేయం. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం.
ఈ వేదికగా మీకు మాట ఇస్తున్నా.. తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం పేదల అభివృద్ధికి పాటుపడుతుంది. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తాం. మేం పాలకులం కాదు..సేవకులం. ఏసుక్రీస్తు మాకు ఆదర్శం. బాధ్యతను మరవకుండా పనిచేస్తూ ముందుకెళతాం. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు. ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల అని, డిసెంబర్లో తెలంగాణలో కూడా మిరాకిల్ జరిగిందని అన్నారు. క్రైస్తవులు, మైనార్టీలు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారని, వారు కోరినట్టుగానే నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మైనార్టీలకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్ప్రదేశ్, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇంతకంటే మరో గురుతర బాధ్యత మీపై ఉన్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలువాలని కోరుకోండి. మణిపూర్ సంఘటన ప్రస్తుత బీజేపీ వైఖరిని తెలియజేస్తున్నది.
మణిపూర్లో బాధితులను పరామర్శించడానికి రాహుల్గాంధీ ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. అలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది’ అని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను సీఎం అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ రవి గుప్తా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, క్రైస్తవ మత పెద్దలు, ఫాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.