మెదక్: మెతుకుసీమలోని (Medak) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రమైన రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నిర్వహించిన తొలి ఆరాధన ప్రార్థనల్లో పాల్గొన్న మెదక్ సీఎస్ఐ చర్చి ఇన్చార్జి బిషప్ పద్మారావు దైవ సందేశం చేశారు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమిపైకి పంపించిన రోజే క్రిస్మస్ అని, క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ అని చెప్పారు. క్రీస్తు రాక ఈ లోకానికి శుభసూచకమన్నారు. ఆకాశంలో తోకచుక్క ఉద్భవించగానే ఈ విశ్వానికి వెలుగులా మన జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడే ఏసుప్రభు అని తెలిపారు.
ప్రభువైన యేసు ఈలోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ఆచార్యకర్త, ఆలోచన కర్త గల దేవుడు అని, ఈ సమాజానికి అధిపతి అని చెప్పారు. లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభువు అభిమతమన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకొని నడుచుకోవాలని సూచించారు. ప్రభువుకు మరణం లేదని, ఆయన మాటల్లో జీవముందని చెప్పారు. సమాజ రక్షకుడిగా ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. ప్రభువు చూపిన మార్గాలను అనుసరించడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ సందేశమని చెప్పారు. ప్రజలకు, క్రైస్తవులకు, మహా దేవాలయానికి విచ్చేసిన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.