రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చర్చిలకు వెళ్లి తమకు ఆయురారోగ్యాలు కలగాలని, సిరిసంపదలు కలుగజేయాలని యేసు ప్రభువును వేడుకొన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ (చర్చి ఆఫ్ సౌత్ ఇండియా) కెథడ్రాల్ చర్చిలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము 4:30 గంటలకు శిలువ ఊరేగింపుతో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కులమతాలకతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ పద్మారావు పాల్గొని భక్తులకు వాక్యోపదేశం చేశారు. అలాగే, హైదరాబాద్లోని కల్వరి టెంపుల్లో క్రైస్తవులు భారీగా తరలివచ్చి, ప్రార్థనలు చేశారు.