ఖైరతాబాద్, డిసెంబర్ 15 : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై క్రైస్తవ సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆమె చర్యలతో క్రైస్తవ సమాజం ఆవేదనకు గురవుతున్నదని, తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసత్య ప్రేలాపనలు చేయడం మానుకో. నీ చర్యలతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం ఆవేదన చెందుతున్నది.
ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే.. ప్లీజ్ షటప్ అండ్ గెటౌట్ ఫ్రం సెక్యులర్ తెలంగాణ అనాల్సి వస్తుంది’ అని తీవ్రస్వరంతో హెచ్చరించాయి. గురువారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైస్తవ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరుసలేం మత్తయ్య, భారత క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ భాస్కర్ ముల్కల మాట్లాడుతూ షర్మిల తీరుపై ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికికోసం మతోన్మాద బీజేపీతోనూ, రాజ్యాంగ వ్యతిరేకులతోనూ లోపాయికారీ ఒప్పందాలు చేసుకొన్న షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్సీ కవితపై అవాకులు చవాకులు పేలుతున్నదని విమర్శించారు.
బీజేపీతో రాజకీయ ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వంపై, కవితపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతానంటే క్రైస్తవ సమాజం చూస్తూ ఊరుకోబోదన్నారు. దళిత క్రైస్తవులను గుర్తించబోమని చెప్తున్న బీజేపీతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ఎలా అంటకాగుతున్నారని మత్తయ్య ప్రశ్నించారు. దురుద్దేశంతో బీఆర్ఎస్పై బురదజల్లుతున్న తీరును తెలంగాణ క్రైస్తవులు, పాస్టర్లు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ఆమె పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. షర్మిల బీజేపీ గూటి పక్షి అని, ప్రధాని మోదీ ఇటీవల ఫోన్ చేయడంతో మరింత తేటతెల్లమైందని అన్నారు.
దళిత క్రైస్తవులను చీల్చే కుట్ర
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేయాలన్నదే షర్మిల అసలు ఉద్దేశమని జెరుసలేం మత్తయ్య, బిషప్ భాస్కర్ ముల్కల చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి దళిత క్రైస్తవుల ఓట్ల ద్వారానే ముఖ్యమంత్రులు అయ్యారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో క్రైస్తవులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉప్పల్ బీఆర్ఎస్ కన్వీనర్, క్రైస్తవ సంఘం నాయకులు ప్రకాశ్రావు మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీతో తెలంగాణలో అలజడి సృష్టించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సౌభ్రాతృత్వంతో జీవిస్తున్న తెలంగాణ సమాజంలో విషపు కుట్రలకు షర్మిల ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై షర్మిల నోరుపారేసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. క్రైస్తవ సంఘం నాయకులు భీమ్రావు మాట్లాడుతూ షర్మిల, ఆమె భర్త అనిల్కుమార్ తమ స్వార్థం కోసం క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని, రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. విలువైన భూమి కేటాయించడంతోపాటు భవనాన్ని సైతం నిర్మిస్తున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వెంటే క్రైస్తవ సమాజం ఉందని స్పష్టంచేశారు.