హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను చూసి బీజేపీ భయపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ దృష్టిని మరల్చేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని అన్నారు. ఇది రాజగోపాల్రెడ్డి అహంకారం, ధనదాహానికీ, ప్రజల ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పారు. హైదరాబాద్లోని హయత్నగర్లో ఆదివారం నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసీ ఏజెంట్ల ఆత్మీయ సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాము ఎన్నోసార్లు రాజీనామాలు చేశామని, కానీ రాజగోపాల్రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేశారని చెప్పారు. రాజగోపాల్రెడ్డి తన స్వార్థం కోసం రాజీనామా చేస్తే ప్రజలు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు.
వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? వ్యవస్థ ముఖ్యమా? అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. నాలుగేండ్లలో రాజగోపాల్రెడ్డి ఒక్కసారి కూడా తమ ఊరికి రాలేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తానని, ఇల్లు కట్టిస్తానని నాలుగేండ్ల క్రితం శివన్నగూడెంలో చెప్పిన రాజగోపాల్రెడ్డి.. ఆ తర్వాత ఫోన్ ఎత్తలేదని, కనీసం మాట్లాడలేదని స్థానికులు వాపోతున్నారని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఆసరా పెన్షన్ రూ.2,016 ఇస్తుంటే.. గుజరాత్లో రూ.750, కర్ణాటకలో రూ.600 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటం తప్ప ఏమైనా చెప్పగలరా? అని నిలదీశారు. దుబ్బాక ఎన్నికల్లో రూ.3 వేల పెన్షన్, ఎడ్లు, బండ్లు ఇస్తామన్నారని, గెలిచాక దికులేరని ఎద్దేవా చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిలకాడ మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని హరీశ్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెడితే ఏటా రూ.6 వేల కోట్ల చొప్పున ఐదేండ్లపాటు ఇస్తామని కేంద్రం ఆశ జూపిందన్నారు. అయితే, ఇది రైతు మెడకు ఉరితాడవుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని వివరించారు. ఇలా వచ్చే రూ.30 వేల కోట్ల కన్నా 65 లక్షల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమని భావించామని స్పష్టంచేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సంతకాలు పెట్టి డబ్బు తెచ్చుకొన్నాయని తెలిపారు. మునుగోడులో ఒకవేళ బీజేపీ గెలిస్తే.. ప్రజలు మీటర్లకు అంగీకరించారని ప్రచారం చేసుకొంటారని, మోటర్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. ఎయిర్పోర్టులు, రైళ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రజా ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని, దేశానికి బీమా సంస్కృతిని నేర్పిన ఎల్ఐసీని ప్రైవేట్పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎస్ఎన్ఎల్లో 75 వేల ఉద్యోగాలు తీసేశారని, భవిష్యత్తులో ఎల్ఐసీ ఉద్యోగులకూ అదే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్ఐసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మునుగోడు నియోజకవర్గం నుంచి సుమారు 40 వేల మంది వలసలు వెళ్లడం ఎవరి పాపమో ఆలోచించాలని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పాలనలో మునుగోడు కొంత మారిందని, ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉన్నదని చెప్పారు. శివన్నగూడెం చెరువులో నీళ్లు పోయించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అభయమిచ్చారు. నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని ప్రకటించారని, టీఆర్ఎస్ గెలిస్తే ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. ప్రజలు బీజేపీ నేతల ట్రిక్కులు నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్రావవవవవవవు కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మర్రిగూడకు వచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ‘టీఆర్ఎస్కు మెజారిటీ ఇవ్వడం మీ బాధ్యత.. మునుగోడు అభివృద్ధి మా బాధ్యత’ అని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, సతీశ్బాబు, కార్పొరేషన్ చైర్మన్లు ఒంటేరు ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన యువతతో మన్సూరాబాద్లో, మర్రిగూడ గ్రామస్థులతో సాగర్రింగ్రోడ్డు సమీపంలోని ఫంక్షన్హాల్లో, వట్టిపల్లి గ్రామ ప్రజలతో మన్నెగూడలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ బీజేపీ సీనియర్ నేత ఎడ్ల మహేందర్రెడ్డితోపాటు వట్టిపల్లి, కొండూరు, రాజంపేట తండాకు చెందిన 300 మందికిపైగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.