మాగనూర్, జూన్ 21 : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇసుక తోడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వాహనాలను ఆదివారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అడ్డుకున్నారు. అనంతరం మాగనూర్ తహసీల్దార్కు ఫోన్ చేసి మాట్లాడారు. సెలవుల రోజుల్లో పట్టపగలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించగా.. ‘మన ఇసుక -మన వాహనం’ ద్వారా అనుమతులు ఉన్నాయని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు.
మన ఇసుక- మనవాహనం నిబంధనల ప్రకారం హిటాచి పెట్టకుండా వాగులో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను చేరవేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తరలించాలిగాని .. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతారా అని చిట్టెం ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుక తరలింపు జరుగాలని, లేకపోతే ఇసుక రవాణాను బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు.