సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఈదులూరు, పందేనపల్లి గ్రామాల్లో రూ. 45 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు .ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని లింగయ్య తెలిపారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. రైతులకోసం రైతు బంధు, రైతు బీమాలాంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని వివరించారు. ఈ రెండు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇచ్చి, ఆదుకుంటున్నదని తెలిపారు.