Chintha Chiguru | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ) : ‘చింతే’కదా అని తీసిపారేయకండి..! ఇప్పుడా చింత చిగురే కొందరికి కాసులు కురిపిస్తున్నది. హైదరాబాద్ మార్కెట్లో కిలో ధర ఏకంగా రూ.700 పలుకుతూ మటన్ రేటుతో పోటీ పడుతున్నది. పల్లెల్లో దీనికి అంత సీన్ లేకున్నా పట్టణాల్లో మాత్రం అత్యంత ఖరీదైన కూరగా మారింది. మూడు కిలోల చేపలు, రెండు కిలోల చికెన్, కిలో మటన్కు సమానంగా ధర పలుకుతున్నది. హైదరాబాద్ గుడిమలాపూర్ హోల్సేల్, రిటైల్ మారెట్తో పాటు రైతుబజార్లలో వారం నుంచి చింత చిగురు విక్రయాలు జోరందుకున్నాయి.
ఆదివారం కిలో చింత చిగురు ధర గుడిమల్కాపూర్ రిటైల్ మారెట్లో కిలో రూ.500-600, మెహిదీపట్నం రైతుబజార్లో రూ.700 పలికింది. బహిరంగ మారెట్లో 100గ్రాములు రూ.50కి అమ్ముతున్నారు. ప్రాణాలకు తెగించి చెట్టు కొమ్మల చివరి వరకు ఎక్కి ఓపికగా చిగురును సేకరించి తెస్తామని, ఎంతో కష్టపడితేగాని ఎక్కువ చిగురు పోగవదని రైతులు చెబుతున్నారు.
చింతచిగురులో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయని న్యూట్రిషన్లు వెల్లడిస్తున్నారు. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం,140మి.గ్రాముల పాస్ఫరస్, 26 మి.గ్రాముల మెగ్నీషియం, 3 మి.గ్రాముల విటమిన్-సీ ఉంటాయని చెప్పారు. శరీరానికి సోకే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని, మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.