Bakka Judson | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్పై బహిష్కరణ వేటు పడింది. ఆయనను ఆరేండ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారన్న బక్క జడ్సన్ వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా అధిష్ఠానం భావించింది.
ఆయన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసు జారీచేసింది. దీనికి జడ్సన్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణా కమిటీ ఆయనను పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా జడ్సన్ స్పందిస్తూ.. 1989 నుంచి కాంగ్రె స్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు సరైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. తనకు మద్దతునిచ్చిన రాహుల్గాంధీ, ప్రియాంకాలకు ధన్యవాదాలు తెలుపుతూనే తెలంగాణలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలుకు నాయకత్వాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు.
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు బక్క జడ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్క్లబ్లో ఈటల రాజేందర్ బాధితులు మాట్లాడుతుండగా, ఆయన పంపించిన గూండాలు దళిత యువకులపై దాడి చేశారని ఆరోపించారు. ఈటల ప్రోద్బలంతో జరిగిన ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అందులో నుంచి ఆయన పేరును తొలగించారని, ఈటలను ఏ-1గా చేర్చాలని జడ్సన్ డిమాండ్ చేశారు.