తాను ఆదివాసీ దేవతలను తులనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని, కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చినజీయర్స్వామి పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చినజీయర్స్వామి మాట్లాడుతూ, మహిళ సమాజంలో శక్తికి కేంద్రమని, మహిళలందరికీ మంగళశాసనాలు పలుకుతున్నామని చెప్పారు. తామంతా రామానుజాచార్య పరంపరగా వచ్చినవాళ్లమని పేర్కొన్నారు.ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయని, అవి సబబా? కాదా? అనే వివేచన వినేవాళ్లకే వదిలేస్తున్నామని చెప్పారు. ఆదివాసీ జనానికి.. ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించే సంప్రదాయంలోంచి వచ్చినవాళమనీ, వాళ్లను చిన్నచూపుగా మాట్లాడే అలవాటు లేదని స్పష్టంచేశారు. అందరినీ ఆదరించాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.
ఒక మాట విన్నప్పుడు, వివేచన చేసేటప్పుడు పూర్వాపరాలు చూడాలని చినజీయర్స్వామి సూచించారు. అలాకాకుంటే అది హాస్యాస్పదం అవుతుందని పేర్కొన్నారు. తాము ఎవరినీ కించపర్చబోమని చెప్పారు. ఒకటి మాత్రం వాస్తవమనీ, ఆదివాసీ దేవతల పేర్లు చెప్పి మరొక రకంగా సొంత లాభాలకు వాడుకునే వ్యక్తులనీ, అది ఒక సామాజిక అనారోగ్యాన్ని కలిగించే స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి వాటిగురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకరికి ఉంటుందన్నారు. సమాజహితం కోరే వ్యక్తిగా అలాంటిది చెప్పడం భావ్యం గనుక అలాంటివాటిగురించి తాము ఎప్పుడైనా ఏదైనా అని ఉంటామన్నారు. అది కూడా ఈ మధ్యకాలంలో అలాంటి మాటలు అనలేదన్నారు. అది ఏదో బహుశా 20 ఏళ్లక్రితం అని ఉంటామని చెప్పారు. తాము మీడియాను పట్టించుకోమని, దూరంగా ఉంటామన్నారు.
ఈ మధ్యకాలంలో సమతామూర్తి గురించి చెప్పేందుకే మీడియాతో టచ్లో ఉన్నామని చినజీయర్స్వామి వెల్లడించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయనే విషయం కొందరు చెప్పారన్నారు. ఇంతవరకూ భారతదేశంలో ఏ సంస్థ చేయని పనులు ఆదివాసీల కోసం వికాసతరంగణి చేసిందన్నారు. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగణి ద్వారా ఎన్నో సేవలందించామని తెలిపారు. తాము ఎవరినీ తక్కువ చూడబోమని స్పష్టంచేశారు.
మోకాలికి,బోడుగుండుకి ముడిపెట్టొద్దని చినజీయర్స్వామి సూచించారు. తనకు ఎవరితో గ్యాప్ లేదనీ, ఎవరైనా దూరం ఉంటే తమకు సంబంధం లేదన్నారు. సమాజానికి మంచిచేసేవారితో కలిసేందుకు ఎప్పుడూ సిద్ధమని స్పష్టంచేశారు. తాము భిక్ష సన్యాసులమనీ, తమ పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదన్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిదికాదన్నారు. తాము సమాజానికి కళ్లలాంటివాళ్లమనీ, తమ బాధ్యత తమకుందని స్పష్టంచేశారు. కేవలం పబ్లిసిటీ కోరుకునే వారు అల్ప ప్రచారం చేస్తున్నారన్నారు. పబ్లిసిటీ కోసం టీవీల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం సులభమనీ, అందుకే కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిదికాదని సూచించారు. తమకు ఎవరితోనూ.. ఎప్పుడూ వివాదాలుండవని స్పష్టంచేశారు. తాము ఎవరికీ భయపడమనీ, ఎవరి వెంటా పడమని చెప్పారు. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది తమ నినాదమని పేర్కొన్నారు. ఆదివాసులను తాము ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు.కొందరు దేవతలను చిన్నచూపు చూశామని అనడం సరికాదన్నారు. కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆదివాసీ దేవతలను తులనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదన్నారు.
ఓ విషయాన్ని పనికట్టుకొని పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్య టీవీల్లో వాళ్లవాళ్ల ముఖాలను చూయించుకునేందుకు చాలామంది ఇష్టపడుతున్నారని చినజీయర్స్వామి చెప్పారు. ఉక్రెయిన్-రష్యా హడావిడి తగ్గిందనీ, ఇక ఏదో ఒక హడావిడి ఉండాలని ఈ అంశం పట్టుకున్నట్టున్నారని చమత్కరించారు. సామాజిక హితం మీద కాంక్ష ఉన్నవారు వచ్చి మాట్లాడాలనీ, విషయం తెలుసుకోవాలని సూచించారు. ఆస్తికులు, నాస్తికులు తమకు మిత్రులేనని,
సమాజవికాసానికి అందరూ కలిసిరావాల్సిందేనన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సమాజానికి ఆరోగ్యకరమని చెప్పారు. చివరగా, ముచ్చింతల్లో దర్శనానికి ఎలాంటి టిక్కెట్ పెట్టలేదని స్పష్టంచేశారు.