ముషీరాబాద్, ఏప్రిల్ 1: గ్రామస్థాయి నుంచి గోమాత పరిరక్షణ జరిగితేనే భూ మాత పచ్చదనంతో పరిఢవిల్లుతుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. గో సంతతిని పెంపొందించేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. గురువారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గో మహాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. సమాజపోషణ కలిగించే ఆవును బతికించుకోవాలన్నారు. వేదాలు, శాస్ర్తాలు గోవు ప్రత్యేకతను చాటుతున్నాయని, గోవుల రక్షణ కోసం చేపడుతున్న ధర్మ కార్యక్రమాలను సకల జనులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. భూమాత సంరక్షణ దిశగా గోమాత రక్షణ, సంతతి వృద్ధికి చర్య లు చేపట్టాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మంలో అత్యంత ప్రత్యేకమైన గోవును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. గోవును దైవంతో సమానంగా ఆరాధించే ప్రక్రియ యుగాలుగా వస్తున్నదని పేర్కొన్నారు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కే శివకుమార్ మాట్లాడుతూ.. గోమాతను రక్షించుకుంటే భూ మాత బాగుంటుందనే నినాదాన్ని గడపగపకూ తీసుకువెళ్తామని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని.. గోహత్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో కొనసాగుతున్న కబేళాలను మూసివేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో గో సంరక్షకుడు విజయరాం, పరిపూర్ణానందగిరి స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.