హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని వెయ్యేండ్లనాటి శివాలయాన్ని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి కోరారు. చిలుకూరులోని శివాలయాన్ని శనివారం ఆయన పరిశీలించి, గ్రామస్థులకు, భక్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుత వాస్తుశిల్ప నైపుణ్యంతో దీనిని నిర్మించారని, నిర్లక్ష్యంతో నేడు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. వేములవాడ చాళుక్యుల కాలంలో చిలుకూరు ఒక జైన బసదిగా విలసిల్లిందని గుర్తు చేశారు. గ్రామానికి చెందిన జైన తీర్థంకరుల శిల్పాలు గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు. పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేసి, చిలుకూరు బాలాజీ గుడికి వచ్చే భక్తులకు అందుబాటులోకి తేవాలని కోరారు.