హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కూరగాయల మార్కెట్లల్లో టమాటా, ఉల్లి ధరలు పడిపోగా, మిర్చి ధర మాత్రం ఘాటెక్కిస్తున్నది. ఇది వరకు కిలో రూ. 80 పలికిన టమాటా, ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా తగ్గాయి. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాలు, పట్టణాల్లోని మార్కెట్లల్లో టమాటా కిలో రూ.20, ఉల్లిపాయలు కిలో రూ.30 వరకు ధరలు ఉన్నాయి.
వ్యాపారులు వినియోగదారులకు టమాటా రూ.20లకు విక్రయిస్తుండగా, రైతులకు మాత్రం రూ.5 కూడా రావడం లేదు. దీంతో టమాటాను మార్కెట్లల్లోకి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కొన్నిచోట్ల రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. ఇక వంటిట్లో అధికంగా వినియోగించే మిర్చి ధరలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మార్కెట్లల్లో నాణ్యత కలిగిన మిర్చి కిలో రూ.80 ఉండగా, రెండోరకం మిర్చి రూ.50 వరకు ధర పలుకుతున్నది.