ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 3 : మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యాపారుల వైఖరిని నిరసిస్తూ మిర్చి యార్డులో జెండాపాటను అడ్డుకున్నారు. తొలుత జెండాపాట క్వింటా ధర రూ.13 వేలుగా నిర్ణయించగా.. రైతు సంఘం ఆందోళన నేపథ్యంలో జెండాపాటను క్వింటా రూ.14,200గా నిర్ణయించి అమలు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ వ్యాపారులు, ఉద్యోగులు కలిసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్తో సమావేశమై సమస్యలను వివరించారు.