మియాపూర్, ఏప్రిల్ 2: ఫుట్బాల్ ఆడుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన విశ్వవిద్యాలయ భూములను విక్రయిస్తే తామెక్కడ చదువుకోవాలని వారు ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా విశ్వవిద్యాలయం లోపలి కేంద్రీయ విద్యాలయానికి చెందిన చిన్నారులు మద్దతు పలికారు. ఈ మేరకు ప్లకార్డులు చేతపట్టి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జాహ్నవి, యశస్వి మాట్లాడుతూ… ఫుట్బాల్ ఆడేందుకు వచ్చిన సీఎం భూములని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, రేపటి రోజున తాము ఎక్కడ చదువుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాలయాల భూములు వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే సీఎం ఆలోచన సరైంది కాదని, వేలాదిమంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే విద్యాలయాలపై ప్రభుత్వం ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవద్దని వారు కోరారు. తక్షణమే సెంట్రల్ వర్సిటీ భూముల విక్రయం ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంతో పాటు అందులో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ సంస్థలను రోడ్డున పడేయవద్దని జాహ్నవి, యశస్వి కోరారు. యూనివర్సిటీలో ఇప్పటికే వేలాది చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించి వన్యప్రాణులకు గూడు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పక్షి నెమలి రోదనకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు.