ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 4: హైదరాబాద్లో స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి దుర్మరణం చెందింది. ఈ హృదయవిదారక ఘటన ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో గురువారం చోటుచేసుకున్నది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన కేరళకు చెందిన మిథున్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. సమీపంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఒకటో తరగతి చదివే కుమారుడిని ఉదయం బస్సెక్కించేందుకు వచ్చిన మిథున్ డ్రైవర్ వైపునకు వచ్చి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో 19 నెలల వయసున్న ఆయన చిన్నారి కూతురు జెవాలన్న అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సు ముందు భాగంలో నిలిచి ఉన్నది. గమనించని డ్రైవర్ మహమ్మద్ ఇంతియాజ్ బస్సును ముందుకుపోనీయడంతో చిన్నారి బస్సు కిందపడిపోయింది. వెనుకటైరు పైనుంచి వెళ్లగా అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.