వరంగల్ : రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Chief Whip Dasyam Vinay Bhaskar)అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ భట్టుపల్లిలో నిర్వహించే ప్రజా దీవెన సభ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక సభలు నిర్వహించి,10 ఏండ్లలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. 80 వేల మందితో ప్రజా దీవెన సభను ఏర్పాటు చేస్తున్నారని, ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
పథకాల గురించి విమర్శించే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేవన్నారు. అభివృద్ధి పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక మోడల్ గా తయారైందన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని పేర్కన్నారు. గ్యారంటీ లేని వారంటీ లేని పథకాలతో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలుపరిచే విషయంలో ఫెయిల్ అయిందని విమర్శించారు.
అమలుకు సాధ్యం కాని పథకాలతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుందని మండిపడ్డారు. తనకు అధిక మెజారిటీ ఇచ్చి, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డిసిసిబి చైర్మన్ మార్నెని, తదితరులు పాల్గొన్నారు.