హనుమకొండ చౌరస్తా, జనవరి 9: బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్రోడ్లోని విద్యుత్తునగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని చూపడానికి బీజేపీ జాతీయ నేతలను వరుసపెట్టి తెస్తున్నారని ఎద్దేవాచేశారు. హిమంత కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్లు కేసులు పెట్టి జైలుపాలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశం మొత్తం గర్వించేలా సీఎం కేసీఆర్ సుపరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమం త బిశ్వశర్మ ఎక్కడైనా ఆగి రైతులతో మాట్లాడి.. సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా గురించి తెలుసుకోవాలని హిత వు పలికారు. బీజేపీ నాయకులకు నగరం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఉక్కుఫ్యాక్టరీ తీసుకురావాలని డిమాండ్చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, టీఆర్ఎస్ నేతలు నెక్కొండ కిషన్, రంజిత్ పాల్గొన్నారు.