హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని బీసీలను సంఘటితం చేస్తామని చెప్పారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓబీసీ వర్గానికి చెందిన మోదీ.. బీసీలకు బియ్యం గింజంత మేలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ ఒక్కరే మేలు చేశారని, బీసీల కోసం 300కు పైగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు.
ఉద్యోగాల సాధన కోసం బీసీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని, దేశమంతా బీసీ కులగణన జరగాలన్నారు. బీజేపీని ఒప్పించి బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని ఆ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్కు సూచించారు. బీసీ నాయకులపై కక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు దిగుతున్నదని విమర్శించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే బీసీలకు ఆత్మగౌరవం లభిస్తున్నదన్నారు. గురుకులాల ఏర్పాటు, గొర్రెలు, ఉచిత చేపపిల్లల పంపిణీ, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తూ బీసీ వర్గాలకు మేలు చేస్తున్నారని వివరించారు. అవసరమైతే సీఎం కేసీఆర్ నాయత్వంలో బీసీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ బీసీ రిజర్వేషన్లకు గండికొట్టింది మోదీ సర్కారు అని వారు ధ్వజమెత్తారు.