హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కర్బన ఉద్గార తీవ్రత తగ్గింపు, సంప్రదాయేతర ఇంధనశక్తి రంగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎస్ పేరొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం స్థాపిత సామర్థ్యం 6,335 మెగావాట్లుగా ఉందని ఆమె తెలిపారు. ఇంధన మిశ్రమంలో పునరుత్పాదకాలను అవలంబిస్తున్న రాష్ర్టాలలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.
2023లో పునరుత్పాదక ఇంధన స్వీకరణ 9.8% ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 14.1% కి పెరిగిందన్నారు. వ్యవస్థాపక సామర్థ్యం పరంగా పునరుత్పాదక శక్తి వాటా దాదాపు 25 శాతం ఉందని ఇంధన పొదుపు చర్యలను అవలంబించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అందించడానికి గ్రామం, మండలాల వారీగా స్థలాలను గుర్తించి నిర్దిష్ట ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని టీఎస్ రెడ్ కో ఎండీని ఆమె ఆదేశించారు. రాష్ట్ర సోలార్ పాలసీ- 2015 ప్రమోషనల్ ప్రయోజనాలతో ఆదేశాలు జారీ చేశామని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ తెలిపారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, టీఎస్రెడ్ కో ఎండీ జానయ్య పాల్గొన్నారు.