హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నదని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’కు నిధులు విడుదల చేశామని చెప్పారు.
బోర్ల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులకు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్ర స్థాయి అధికారులు, నోడల్ అధికారులతో ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జలాశయాల్లో నిరుడు మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నాయని, అయినప్పటీకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఏప్రిల్ రెండో వారం తర్వాత రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ను చేపడతామని చెప్పారు.