CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు. సోమవారం రాత్రి హోటల్ అశోకమౌర్యలో జరిగిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి రేవంత్ హాజరయ్యారు. మంగళవారం కేంద్రమ్రంతులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్సింగ్ పూరి, అశ్విన్వైష్ణవ్తో సీఎం భేటీకానున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రంలో వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సీఎం చర్చించనున్నట్టు తెలిసింది.
పార్టీ పెద్దలతో భేటీ
ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ నుంచి పార్టీ అధిష్ఠానానికి నామినేటెడ్ పోస్టుల భర్తీపై జాబితా అందింది. తమతో చర్చించకుండా నామినేటెడ్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేతలు మొకాలు అడ్డడంతో ఈ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి చర్చించనున్నారని సమాచారం. వివిధ సమీకరణల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీలో వీరికి ప్రాధాన్యత కల్పించే అంశాన్ని ప్రస్తావించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించే నేతలు కొందరిని ముందే బరినుంచి తప్పించేందుకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభకు అవకాశం కల్పించింది. వరంగల్ ఎంపి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించింది.
ఎంపీ టికెట్ ఆశిస్తున్న మరికొందరికి కూడా ఇలానే నామినేటెడ్ పదవులు కట్టబెట్టే అంశంపై అధిష్ఠానంతో సీఎం చర్చిస్తారని సమాచారం. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతగాని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచే తిరిగి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. వరంగల్ నుంచి టికెట్ ఆశిస్తూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి కనబరస్తున్నారు. ఈ అంశాలన్ని అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారని సమాచారం. మరోవైపు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీచేయాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపైనా చర్చిస్తారని చెప్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది తొమ్మిదోసారి.
చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధిసీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సోమవారం మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ నది సరిహద్దులు, ఇతర అంశాలను పటాల సాయంతో అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తిచేయాలని ఆదేశించారు. అన్నింటికంటే ముందుగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.
ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో నిర్వహించనున్న శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల సమతాకుంబ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.