Free Bus |వేములవాడ, జూలై 13: ‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రావణ్- రజిత దంపతులు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సికింద్రాబాద్లో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి వేములవాడకు వచ్చారు. సికింద్రాబాద్ చెందిన మరో కుటుంబం కూడా వేములవాడకు వచ్చి మొక్కులు సమర్పించారు. ఇరు కుటుంబాలు సోమవారం తిరుగు ప్రయాణంకోసం తిప్పాపూర్ ఆర్టీసీ బస్స్టాండ్ చేరుకున్నారు. సికింద్రాబాద్ బస్సు రాగానే ఎగబడ్డారు.
ఈ క్రమంలోనే సీట్ల కోసం శ్రవణ్-రజిత దంపతులు.. మరో కుటుంబానికి వాగ్వాదం జరిగి, ముష్టియుద్ధానికి దారితీసింది. శ్రావణ్పై పిడుగులు గుద్దడమే కాకుండా రజితపై కూడా దాడిచేసి గాయపరిచారు. శ్రావణ్కు ముక్కు నుంచి రక్తం కారడంతో పోలీస్ స్టేషన్ చేరుకొని, పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు.
ఈ సందర్భంగా బాధితురాలు రజిత మాట్లాడుతూ.. ఫ్రీ బస్ ద్వారా మహిళల మధ్య గొడవలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. తాను సీఎం రేవంత్ రెడ్డి అభిమానని, కాంగ్రెస్ కార్యకర్తగా మంత్రి సీతక్కతో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని చెప్పింది.