Telangana Martyrs Memorial | తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించనున్నారు. ఆయన చేతుల మీదుగా ‘తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం’ కార్యక్రమం జరుగనున్నది. సాయంత్రం 6:30 గంటలకు సీఎం కేసీఆర్.. ప్రాంగణానికి చేరుకొంటారు. అనంతరం 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ ఉంటుంది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభిస్తారు. అటు 21 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధన ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకొన్న వారి త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్లేలా.. తరతరాలకు స్ఫూర్తి రగిలించేలా తెలంగాణ సర్కారు హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం ఈ స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆయన చేతుల మీదు గా ‘తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమం జరుగనున్నది. హైదరాబాద్ నడిబొడ్డున యావత్తు తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. త్యాగధనుల ఆశయాలు నిత్యం స్ఫురణకు వచ్చేలా ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది. తద్వారా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం నిత్యం నివాళి అర్పించనున్నది.
అమరుల స్మారకం ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీ, పోలీసు తదితర విభాగాల అధికారులు ప్రారంభ ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి 6 వేల మంది కళాకారులతో స్మారక చిహ్నం వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకొంటారు. అనంతరం 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభిస్తారు. ఆ వెంటనే సభావేదికపైకి చేరుకొంటారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపిస్తారు. సభలో 10వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానిస్తారు. అలాగే, లేజర్, 800 డ్రోన్లతో షో నిర్వహించనున్నారు.