నల్లగొండ, జూలై 25: త్వరలోనే ఉద్యోగులు సీపీఎస్, పీఆర్సీ, సీలింగ్లెస్ హెల్త్ ఇన్స్యూరెన్స్పై శుభవార్తలు వింటారని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆశాభావం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు కమిటీలు వేసి ఏండ్ల తరబడి కాలయాపన చేసేవని, తెలంగాణ ప్రభుత్వంలో కమిటీలు లేకుండానే అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిలా ్లకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా టీఎన్జీవో ఉద్యోగుల సమావేశంలో మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని జీతాలు రాష్ట్రంలోని ఉద్యోగులకే ఉన్నాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ఆదాయంపన్ను చెల్లిస్తున్నారంటే మన స్థాయిని సీఎం కేసీఆర్ ఏమేరకు పెంచారో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ఉద్యోగుల బాధలు పూర్తిగా తెలుసని, ఉద్యోగులను కడుపులో పెట్టుకోని చూసుకుంటున్నారని అన్నారు. కొందరు కావాలనే మనలో చీలికలు తెచ్చి విడదీయాలని కుట్రలు పన్నుతారని, అలాంటి వారి మాటలు వింటే మన పనులు ఎప్పటికీ జరుగవని పేర్కొన్నారు. నిరుడు 30% ఫిట్మెంట్ సాధించామంటే ఉద్యోగుల ఓపిక, సీఎం కేసీఆర్ దార్శనికత కారణమని, అదే ఓపికతో ఉంటే మంచి ఫలితం వస్తుందని చెప్పారు.
ప్రభుత్వ రుణం తీర్చుకుంటాం
దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల కోరికలు, సమస్యలు నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వ రుణం తీర్చుకుంటామని మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల వెతలు తీర్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేసేందుకు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో కృతజ్ఞత సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీల క్రమబద్ధీకరణ, వీఆర్వోలను సర్దుబాటు చేయడం వంటి చరిత్రాత్మక నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎం శ్రవణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి నర్సింహాచారి, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి కిరణ్కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జానీమియా పాల్గొన్నారు.