CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఇది దశాబ్ది సందర్భం. ఉద్యమనాయకుడే పాలకుడైతే.. ఒక సామూహిక కల ఎలా సాకారమవుతుందో కేసీఆర్ చేసి చూపించారు. నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ నికార్సయిన అభివృద్ధికి తెలంగాణ మాడల్గా మారింది. గుణాత్మక అభివృద్ధికి ఉదాహరణగా నిలిచింది. పసికందు రాష్ట్రం ప్రగతి పరుగులు తీస్తుంటే.. యావత్తు దేశం విస్తుపోయి చూస్తున్నది. తెలంగాణను అనురిస్తున్నది.
ఒకప్పుడు కోతలతో అల్లాడిన రాష్ట్రం ఇప్పుడు రెప్పపాటైనా కరెంటు పోకుండా దేదీప్యంగా వెలుగుతున్నది. ఒకప్పుడు అంబలి కేంద్రాలతో పొట్టనింపుకొన్న పాలమూరు ఇప్పుడు పచ్చని పంటలతో అలరారుతున్నది. రాష్ట్రం వచ్చినప్పుడు ఎరువుల వినియోగం 8 లక్షల టన్నులు. దానికీ రైతుల యాతన. చెప్పుల బారులు. ఇప్పుడు రాష్ట్ర ఎరువుల వినియోగం 28 లక్షల టన్నులు. ఒక్క ఇబ్బందీ లేదు. ఇదెట్ల సాధ్యమైంది? పాలనలో చిత్తశుద్ధి, నిర్దిష్ట లక్ష్యంతో 9 ఏండ్లలోనే సమ్మిళిత అభివృద్ధి సాకారమైంది.
గురువారం హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 9 ఏండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్కో అడుగులో, ఒక్కో ప్రయత్నంలో ఎదురైన అనుమానాలను, అపోహలను ప్రస్తావించారు. ఫలితాలను చూపడం ద్వారా వాటిని పటాపంచలు చేసిన తీరును వివరించారు. రాష్ట్ర చరిత్రలో కలకాలం నిలిచేలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి మూడు వారాలుపాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో జరుపాలని స్పష్టం చేశారు. ఉత్సవాల ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన ‘తెలంగాణకు హరితహారం’ సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి పంట వేసే విధానంలో మార్పు చేసి, ముందస్తుగా నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. స్వపరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని రంగాల వారీగా వివరించారు. ఉత్సవాల్లో రోజువారీ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు తెలియజేశారు. ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన శాఖలకు అభినందనలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను జిల్లాలవారీగా వీడియో రికార్డు చేసి భద్రపరచాలని కలెక్టర్లను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే పదేండ్ల ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి ప్రజలకు అందజేయాలని సూచించారు. ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరించేలా డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని, వాటిని ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు.
దేశానికే ఆదర్శమైన పాలన అందించాం
ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శమైన పాలన అందించగలిగామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ నేడు అత్యద్భుత ఫలితాలను సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ‘దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి సమిష్టి కృషితో అతి తకువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటీ, పరిశ్రమలు, విద్యుత్తు సహా అన్ని రంగాల్లో దేశంలో ముందంజలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానాను దాటేసి దూసుకుపోతున్నది.
రాష్ట్రం వచ్చినప్పుడు ఎరువుల వినియోగం కేవలం 8 లక్షల టన్నులు కాగా, ఇప్పుడు 28 లక్షల టన్నులకు చేరింది. ఒక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎరువులను, ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శనిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో ఇప్పుడు పచ్చని పంటలతో, పారే వాగులతో పాలుగారే పరిస్థితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ను దాటేసి పోతున్నం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ విద్యార్థులు నీట్, సివిల్స్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందు వరుసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండటం పట్ల సీఎం హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులను అభినందించారు.
ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి
గత పాలకుల నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో, వ్యవసాయ రంగ పునరుజ్జ్జీవమే ప్రథమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి ఆధార వ్యవస్థలైన చెరువులు, విద్యుత్తు, సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేశామని తెలిపారు. వాటి పర్యవసానంగానే రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణమైన చర్యలను జిల్లా కలెక్టర్లు చేపట్టాలని, రైతులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు జరిగిన పంట నష్టం, రైతుకు కలిగిన కష్టాలను గుణపాఠంగా తీసుకొని పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.
‘ప్రాజెక్టులతో సాగు నీరు పుషలంగా అందుబాటులో ఉన్నది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, కావాల్సినన్ని భూగర్భజలాలు ఉన్నాయి. మొగులు మొఖం చూడకుండా కాల్వల్లోని నీళ్లతో వరి నాట్లు వేసుకొనే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి. యాసంగి నాట్లు ఆలస్యం కావడం వల్ల కోతలు లేటవుతున్నాయి. మార్చి 31లోపే పూర్తికావాల్సిన కోతలు.. మే నెల దాటినా కొనసాగుతున్నాయి. దీంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంట దెబ్బతింటున్నది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15-20 మధ్య యాసంగి వరినాట్లు వేసుకోవాలి. యాసంగి నాట్లు ముందుగా పడాలంటే.. వానకాలం వరినాట్లు కూడా ముందుకు జరపాల్సి ఉంటుంది.
కాబట్టి రోహిణి కార్తె ప్రారంభంలోనే వానకాలం వరినాట్లు మొదలు కావాలి. మే 25- జూన్ 25 వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాలి. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ సహకారంతో రైతులను చైతన్యం చేయాల్సి ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. యాసంగిలో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో ఉన్నదని, అది వాస్తవం కాదని సీఎం స్పష్టం చేశారు. ‘వరి తుకం పోసేటప్పుడు కాదు.. వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. వరి ఈనే సమయంలో చలి ఉంటే తాలు ఎకువవుతుంది. ఎండలు ముదరకముందే వరి కోసుకుంటే గింజ గట్టిగా ఉండి తూకం కూడా బాగుంటుంది. రైతు సోదరులు ఇది గమనించాలి’ అని కోరారు. ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకొంటున్న చర్యలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వివరించారు.
4.01 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు
వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,05,601 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేస్తామని చెప్పారు. తద్వారా 1,50,012 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపిస్తుందని, ఈ బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును అందజేస్తామని చెప్పారు. వీరితోపాటు 3.08 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధు వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు. సమీక్షలో మంత్రులు, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
బీసీ, ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం
బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మ తదితర బీసీ, ఎంబీసీ కులాలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతను ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని సూచించారు. జూన్ 9న జరుపుకొనే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో భాగంగా సబ్ కమిటీ సిఫారసు చేసినవారికి, ఇప్పటికీ ఆదుకోని బీసీ, ఎంబీసీ కులాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
సఫాయన్నా నీకు సలాం
గ్రామ, పట్టణ స్థాయిల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా ‘సఫాయన్నా- నీకు సలామన్నా’ అనే నినాదంతో వారిని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని తెలిపారు. ‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ తోటి మానవుల కోసం జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు భగవంతుడితో సమానం. వారు చేస్తున్న పనికి మనం ఏమాత్రం వెలకట్టలేం. వారికి ప్రభుత్వం సాయం చేయడమంటే పరోక్షంగా సమాజానికి సాయం చేసినట్టే. సఫాయి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వారు ఎటువంటి డిమాండ్ చేయకున్నా.. వారిమీద గౌరవంతోనే జీతాలు పెంచుతున్నాం’ అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేని సమాజాన్ని ఊహించుకోవడం కూడా కష్టమేనని అన్నారు. దేశ అభివృద్ధిలో, రాష్ర్టాభివృద్ధిలో సఫాయన్నలు, అకల పాత్ర చాలా గొప్పదని కితాబిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ సఫాయి కార్మికులను గుర్తించి మహిళ, పురుష కార్మికులకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి
నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని తెలిపారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు మొదట బేస్మెంట్ దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష అందజేయాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశలను ఫొటోలు, తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకొని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు దశలవారీగా పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట విధివిధానాలను రూపొందించి కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. దీంతోపాటు ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్ధతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సూచించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి, దశలవారీగా అమలు చేయాలని ఆదేశించారు.