Singareni | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘134 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి తెలంగాణ సొత్తు. నిజాం కాలంలో మొదలైన ఈ సంస్థ వేల మందికి అన్నం పెట్టి సాకింది. అటువంటి సంస్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారు. వారికి పరిపాలన చేతగాక, సరిగా నడిపించక, కేంద్రం నుంచి అప్పులు తెచ్చారు. ఆ అప్పులు తిరిగి చెల్లించలేక మన సొంతమైన కంపెనీలో కేంద్రానికి 49 శాతం వాటా అమ్మేశారు. కార్మికులు మాట్లాడితే అణిచివేశారు. రాచి రంపాన పెట్టారు. సింగరేణిని కాంగ్రెస్ సగం చంపితే.. పూర్తిగా చంపేందుకు నేడు బీజేపీ కంకణం కట్టుకొన్నది. ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించబోమని మాట ఇచ్చి.. బెంగళూరుకు వెళ్లగానే మోసం చేసి బొగ్గు గనులకు టెండర్లు పిలిచారు. చోటే మియాతో చోటే మియా.. బడే మియా సుబానల్లా అన్నట్టు సింగరేణిని కాంగ్రెస్ సగం, బీజేపీ సగం నాశనం చేశాయి’ అని సీఎం మండిపడ్డారు.
సింగరేణి సంస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వ కుట్రలను ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘సింగరేణి ద్వారా మా బతుకు మేం బతుకుతున్నం.. మ మ్మల్ని ఇలా బతకనివ్వండి అని మనం అంటు న్నాం. సింగరేణికి తాళం వేయనిద్దామా..? దేశంలో బొగ్గుకు కొరత లేదు. సింగరేణితోపా టు ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ మొత్తం కలిపి దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేలింది. దేశంలో ఇంత భారీ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉండగా కరెంట్ను ప్రైవేటీకరిస్తామంటున్నారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తామని, కరెంట్ ఉద్యోగులను పీకేస్తామని, సింగరేణిని ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తామని అంటున్నారు. ఇదేం దిక్కుమాలిన పా లసీ? దీన్ని ఎదుర్కొనేందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశవ్యాప్తంగా పోరాటానికి న డుం బిగించాం. దేశంలో చెడ్డ పాలసీలను ప్రతిగటించేందుకు ముందుకు పోతున్నం’ అని సీఎం తెలిపారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో ప్రైవేటువాళ్లు గనులను లీజుకు తీసుకొంటున్నారని తెలిసి దానిపై అధ్యయనం కోసం ఎండీ శ్రీధర్, ఇతర అధికారులను అక్కడికి పంపించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో దండిగా ఐర న్ ఓర్, ఖనిజ నిల్వలు ఉన్నాయని, మైనింగ్ లో బాగా అనుభవం సంపాదించిన వజ్రపు తునకలాంటి సంస్థ సింగరేణి అని, అందుకే మిగిలిన గనుల తవ్వకాలను సింగరేణికే అప్పగించాలని పాలసీ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. సింగరేణిని మరింత విస్తరించి ఉద్యో గ వనరుగా మార్చుతామని ప్రకటించారు.
గతంలో సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు దురదృష్టవశాత్తు చనిపోతే రూ.లక్ష మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకొనేవారని, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచిందని సీఎం తెలిపారు. ‘డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా రిటైర్మెంట్ తీసుకొంటే వారికి రూ.25 లక్షలు ఇచ్చేవిధంగా మార్పులు చేశాం. కార్మికులకు వడ్డీ లేకుండా ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల రుణం ఇస్తున్నాం. సింగరేణి స్థలాల్లో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని బతుకుతున్న 22 వేల మందికి జీవో 76 ద్వారా ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చాం. ఇటీవల బెల్లంపల్లిలో సుమారు 7,500 మం దికి ఇండ్ల స్థలాలు ఇచ్చాం. మిగిలిన చోట్ల కూడా ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వటం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘కరెంటు ఇయ్యలేక ఫ్యాన్లు బంద్ చేయాలని ఆస్సాం సీఎం ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. మరో సీఎం ఏసీలు బంద్ చేయాలని, మరో వద్ద మధ్యాహ్నం వరకే ఆఫీసులను నడిపించాలని చెప్తున్నారు. కరెంట్ కోతలు లేకుండా, లో ఓల్టేజీ లేకుండా, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేకుండా రైతులు నిశ్చింతగా ఎప్పుడంటే అ ప్పుడు మోటర్లు పెట్టుకునేలా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో దేశమంతటికీ 150 సంవత్సరాలపాటు కరెంట్ ఇవ్వొచ్చని సీఎం తెలిపారు. అయినప్పటికీ దుర్మార్గంగా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకొంటూ ఖర్చు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పసిగట్టి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
2014 కంటే ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ 18 శాతమే ఉండేదని.. రూ.50-60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేవారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి నడక మారింది. సింగరేణి ైస్టెల్ మారింది. 2014లో రూ.11 వేల కోట్లు ఉన్న టర్నోవర్ను.. మన బిడ్డల శ్రమ శక్తితో రూ.33 వేల కోట్లకు పెంచుకొన్నాం. సింగరేణికి గతంలో ఏటా రూ.300-400 కోట్ల లాభాలు మాత్రమే వచ్చేవి. కానీ, ఈ సంవత్సరం వచ్చిన లాభాలు రూ.2,184 కోట్లు’ అని సీఎం వెల్లడించారు.
వచ్చే దసరా పండుగకు సింగరేణి కార్మికులకు బోనస్గా రూ.700 కోట్లు పంచబోతున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. నాడు కంపెనీకి వచ్చిన లాభాలకంటే డబుల్, ట్రిపుల్ అంత బోనస్ ఇచ్చుకొనే స్థితికి నేడు సింగరేణిని తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 10 ఏండ్లపాటు రాజ్యమేలిన కాంగ్రెస్ కల్పించిన ఉద్యోగాలు 6,453 మాత్రమేనని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించి 15,256 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా కొత్తగా 19,463 ఉద్యోగాలను కల్పించినట్టు వెల్లడించారు.