CM KCR | ధరణి కావాలా? దందా కావాలా?.. అని సీఎం కేసీఆర్ అడుగుతుంటే ధరణి ఉండాల్సిందే.. అంటూ మంచిర్యాల ప్రజానీకం నినదించింది. సీఎం అడిగిన వెంటనే బహిరంగ సభకు వచ్చిన వేల మంది ఒకేసారి చేతులెత్తి ధరణికి తమ మద్దతు తెలిపారు. మూడేండ్లు రాత్రి పగలు కష్టపడి ఈ పోర్టల్ను తీసుకొచ్చానని సీఎం అనగానే ప్రజలు జేజేలు పలికారు. దివ్యాంగులకు పెన్షన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు ప్రకటించగానే సభ మొత్తం ఈలలు, కేకలతో మార్మోగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ మంచిర్యాల మరిన్ని కొత్త సంక్షేమ పథకాలకు వేదికగా నిలిచింది. చేతివృత్తులకు రూ.లక్ష సాయం, నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, మరో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇంటికే పంపిస్తున్నం. హైదరాబాద్ నుంచి ఏటా రైతు బంధు ద్వారా రూ.15-16 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేస్తున్న. పెట్టుబడి సాయం పడంగనే రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగుతున్నయ్. వడ్లు అమ్మినంక వారం లోపల అకౌంట్లో డబ్బులు పడుతున్నయ్. ఇదంతా ధరణి పుణ్యమే.
ధరణి లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు.
దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నయ్. వీటితో 150 ఏండ్లు కరెంటు ఇవ్వొచ్చు. కానీ, దుర్మార్గంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటూ ఖర్చు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నరు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకే
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశవ్యాప్త పోరాటానికి నడుం బిగించినం. – సీఎం కేసీఆర్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న శుభతరుణాన పది వరాలకు మంచిర్యాల జిల్లా వేదికైంది. సంక్షేమ సంబురాలు జరుపుకొన్న శుక్రవారం రోజే రాష్ట్ర సంక్షేమానికి మరో ముందడుగు పడింది. ఆ ‘దశా’బ్ది వరాలు ఇవే..
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకాలంలో రావడానికైనా, భూముల రిజిస్ట్రేషన్ గోస తీరడానికైనా, ధాన్యం పైసలు తక్షణం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడటానికైనా ధరణే కారణమని స్పష్టంచేశారు. ధరణితో రైతుల గోస తీరందని తెలిపారు. తెలంగాణకు సింగరేణి సంస్థ వజ్రపు తునక అని, దీన్ని కాంగ్రెస్ సగం చంపితే, మిగతా సగాన్ని చంపేందుకు బీజేపీ కంకణం కట్టుకొన్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్లనే నేడు గంటలోపే రిజిస్ట్రేషన్, పది నిమిషాల్లోనే పాస్బుక్ లభిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వచ్చేందని, ధరణితో ఆ దుర్మార్గానికి ముగింపు పలికామని పేర్కొన్నారు. ‘గతంలో రైతులకు వారి భూమి ఎక్కడుందో తెలిసేది కాదు. ఏం మాట్లాడినా లంచమియ్యాలె.. పహాణీ నకలు కావాలంటే లంచమియ్యాలె.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచమియ్యాలె.. పైరవీకారులకు లంచమియ్యాలె.. పట్టా కావాలంటే చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది’ అని గుర్తుచేశారు.
ధరణి వచ్చిన తర్వాత రైతుల కష్టాలన్నీ తీరిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే దినవారం పూర్తికాకముందే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా సొమ్మును అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుం డా, దరఖాస్తు పెట్టాల్సిన పని లేకుండా, పైరవీ అవసరం లేకుండా రైతు ఇంటికే చెక్కు వస్తున్నదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో రైతు చనిపోతే ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు. అది కూడా ఏ ఒక్క రైతుకూ పూర్తిగా చేతికి వచ్చేదికాదు. యాడాద్దినం (సంవత్సరీకం) పూర్తయ్యేవరకు కూడా ఆ పైసలు రాకపోతుండె. దరఖాస్తులు పెట్టి, దండాలు పెట్టి మూణ్ణెళ్లు, ఆర్నెళ్లు తిరిగితే రూ.10 వేలో, రూ.20 వేలో చేతిలో పెట్టి పంపించేవాళ్లు. కానీ, ఇప్పుడు రైతు చనిపోయిన 10 రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు కుటుంబానికి చేరుతున్నది’ అని వివరించారు. రైతుబంధు కోసం ఏటా రూ.15-16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ‘హైదరాబాద్లో రైతుబంధు పైసలు వేస్తే.. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమవుతున్నా యి. గతంలో పండించిన ధాన్యాన్ని అమ్మాలం టే ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లలో, లారీల్లో నింపుకొ ని బీట్లకు, అంగళ్లకు, మార్కెట్లకు పోయి మూ డు నాలుగు రోజులు కావలి ఉండి అమ్ముకొనేవాళ్లు. వడ్లు అమ్మినంక పైసల చిట్టీ రాసిచ్చి 15 రోజులకు, నెలకు రాపో అని చెప్పేవాళ్లు. కానీ ఇయ్యాల వడ్లు అమ్మినంక వారంలోనే సక్కగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడ్తున్నయ్. ఇదం తా ధరణి పుణ్యం. ధరణి లేకపోతే ఇవన్నీ అయ్యేవి కావు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, ప్రతిచోటా లంచాలు ముట్టజెప్పే పరిస్థితి ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు గంటలోపే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయని, పది నిమిషాల్లోనే పాస్బుక్ చేతికొస్తున్నదని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసుకు పొద్దున పోతే గంట సేపట్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఐదు నిమిషాల్లో భూమిని పాస్బుక్కుల్లోకి ఎక్కిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కష్టాలు తొలగించేందుకే ధరణి ద్వారా ఈ మార్పులన్నీ చేశామని తెలిపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 52 మండలాలుంటే, ఇప్పుడు 70కి పెరిగాయని.. గతంలో ఎనిమిది రిజిస్ట్రేషన్ ఆఫీసులుంటే, నేడు 78కి పెంచినట్టు చెప్పారు.
గతంలో నీళ్లు లేక, కరెండు రాక పంటలు పండించేందుకు రైతులు చాలా గోస పడ్డారని, తెలంగాణ రాష్ట్రంలో ఆ కష్టాలన్నీ తీర్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఈ యాసంగిలో భారతదేశం మొత్తంమీద 94 లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేయగా, ఒక్క తెలంగాణలోనే 56.40 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించినం. ఇప్పుడు దేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ. గతంలో కోటి టన్నుల వడ్లు పండితే చాలా గొప్ప అనుకొనేవారు. ఇవాళ తెలంగాణలో సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిక్కుమాలిన నిర్ణయాల వల్ల నేటికీ పామాయిల్ను దిగుమతి చేసుకొంటున్నామని, ఆ బాధను తప్పించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుచేయాలని లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నట్టు తెలిపారు. పామాయిల్ సాగుకు మంచిర్యాల రైతులు ముందుకొస్తున్నారని.. వారికోసం రూ.500 కోట్లతో మందమర్రిలో పామాయిల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆదివాసీ, గిరిజనులకు పోడు భూములపై పట్టాలు ఇస్తున్నామని, యాదవ సోదరులకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తున్నామని, మంచిర్యాల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంబీసీ కులాల్లో వెనుకబడినవారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని, సొంత జాగా ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించే గృహలక్ష్మి పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి నది 250 కిలోమీటర్ల మేర జల కళను సంతరించుకొన్నదని సీఎం చెప్పారు. ఇటువంటి గోదావరిని ఎన్నటికైనా చూస్తామా! అని ఉద్యమ సమయంలో అనుకొనేవాడిని ఇప్పుడు సజీవ గోదావరిని చూస్తుంటే కండ్లు నిండినయ్. ఇది తెలంగాణ వచ్చిన ఫలితం. పట్టుబట్టి, జట్టుకట్టి లక్ష్మి, పార్వతి, సరస్వతీ బరాజ్లతోపాటు పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకొంటే 250 కిలోమీటర్ల మేర గోదావరిని సస్యశ్యామలం చేసుకుంటం’ అని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటైన మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నది. మంచిర్యాల జిల్లా కావాలనేది ప్రజల చిరకాల కాంక్ష. దానిని నెరవేర్చాం. మంచిర్యాలలో మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా దవాఖాన నెలకొల్పాం. బీఆర్ఎస్ చేసిన మంచి పనులు అన్ని గ్రామాలకు చేరాయి. మంచిర్యాల, బెల్లంపల్లివాసులు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన బాధలు తప్పాయి.
-సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో కరువకు నిలయంగా ఉన్న తెలంగాణను నేడు దేశానికే తలమానికంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘తలసరి ఆదాయంలో పెద్ద రాష్ర్టాల్లో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. విద్యత్తు వినియోగంలో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. మంచి గ్రామ పంచాయతీలు, మంచి మున్సిపాలిటీల్లో నంబర్వన్ ఎవరంటే తెలంగాణ రాష్టం. తాగునీటి సదుపాయంలో, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు సరఫరా చేయటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు ద్వారా ఇప్పటికే రూ.65 వేల కోట్లు రైతులకు అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
ఉద్యమ సమయంలో గోదావరిఖనిలో సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. మన సేను, మన సెలక ఎడారి’ అని పాడుకున్నామని.. ఇవాళ తలాపున పారుతున్న గోదారి ఎంత నిండుగా, ఎంత మెండుగా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో అందరం చూస్తున్నామని సీఎం అన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి సాగునీరందించేందుకు రూ.1,658 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. వార్ధా నదిపై కూడా బరాజ్ కడుతున్నామని, దీనివల్ల ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందిస్తామని ప్రకటించారు.