తరతరాలుగా కులవృత్తులను నిర్వహిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందువల్ల ఓబీసీలు, మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు పెట్టి ఆమోదించాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటినీ ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఓబీసీ, మహిళా బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, దేశవ్యాప్తంగా వారి హకులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తునే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశాలను ఎంపీలు ఉభయ సభల్లో లేవనెత్తి గట్టిగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
తరతరాలుగా కుల వృత్తులను నిర్వహిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్ట సభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సంపద సృష్టిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్న బీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉన్నదని పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ సత్ఫలితాలిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపింది. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పార్టీ పునరుద్ఘాటించింది. ఓబీసీలకు పార్లమెంటు, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి కేంద్రప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే (14 జూన్, 2014) బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని సమావేశం గుర్తుచేసింది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపి 9 ఏండ్లు గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది.
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగుతుందని సమావేశం ఉద్ఘాటించింది. మహిళా శక్తిని సరిగ్గా వినియోగించినప్పుడే ఏ సమాజమైనా ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నది. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సమావేశం స్పష్టంచేసింది. రాజకీయాల్లో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే (14 జూన్ 2014) ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇంతవరకు పట్టించుకోకపోవడంపై సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, పార్ధసారథిరెడ్డి, జీ రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలి.
మహిళలకు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ అనుకూలమని గతంలోనే తెలియజేశాం. రిజర్వేషన్లపై జూన్ 14, 2014న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. దీనిపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాజ్యాంగం రచన సమయంలో విస్మరించిన కొన్ని అంశాలను సరిదిద్దుకోవడానికి నాటి మేధావులు దార్శనికతతో అవకాశం కల్పించారు. దీనిని వాడుకుని చట్టసభల్లో 33 శాతం బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేస్తున్నది. ఇప్పటికే మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం.
మహిళలపై వివక్ష పోవాలంటే చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది.
బీసీలకు, మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఈ రెండు బిల్లులపై త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఈ నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రత్యేక శ్రద్ధవహించాలని ప్రధానిని కోరింది.