హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఆర్థికంగా నష్టపరిచే అదానీ వ్యవహారంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు. కోట్ల మంది ప్రజలకు చెందిన రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైతే ప్రధానికి పట్టింపు లేదా? అన్ని ప్రశ్నించారు. మోదీ పాలనలో 20 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశ ప్రజలకు మేలు చేసేలా అర్థవంతమైన చర్చ జరుగాల్సిన పార్లమెంటులో మోదీ భజన, వ్యక్తిగత దూషణలే వినిపిస్తున్నాయని మండిపడ్డారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు అత్యంత అసహ్యంగా ఉన్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశం నేడు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరవడమనేది దేశానికి అతిపెద్ద సమస్య అని అన్నారు.‘కోట్ల మంది ప్రజలకు సంబంధం ఉన్న అత్యంత ప్రాధాన్య విషయంపై చర్చించకుండా, దానిని చీకట్లో పెట్టి ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం దారుణం. నువ్వు నా కన్నా పెద్ద షుంటవు అంటే.. నువ్వే నా కన్నా పెద్ద షుంటవు.. నువ్వెన్ని ప్రభుత్వాలను కూల్చేశావంటే.. నువ్వెన్ని కూల్చేసావంటూ నిందలు వేసుకొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. లేదంటే దేశానికి ఎలాంటి మేలు జరగదు. ఎప్పుడో 60 ఏండ్ల కింద చనిపోయిన నెహ్రూ గురించి, 40 ఏండ్ల కింద మరణించిన ఇందిరాగాంధీ గురించి సభలో మాట్లాడటం దారుణం. ప్రభుత్వాల కూల్చివేతపై మోదీ, రాహుల్గాంధీ పరస్పర ఆరోపణలు చేసుకోవడం విచిత్రంగా ఉన్నది. చోటే భాయ్ సుభాన్ అల్లా… భడే భాయ్ మాషా అల్లా అన్నట్టు వాదించుకోవడం దారుణం. అదానీ సమస్య ఎక్కడికి పోయింది? దేశం ఎక్కడికి పోతుందనే అంశంపై మాత్రం చర్చ జరగడం లేదు. ఇదేనా దేశంలో జరగాల్సిన చర్చ? జపాన్లో ఏం జరుగుతున్నది.. సింగపూర్లో ఏం జరుగుతున్నది.. చైనాలో ఏం జరుగుతున్నది.. అక్కడ ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు.. ప్రజలు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే అంశాలను మాత్రం ఆలోచించడం లేదు. దేశ ప్రజల జీవితాలతో పరాచికాలు ఆడుతున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు’ అని సీఎం అన్నారు.
మోదీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన లక్షల మంది భారతీయులు పౌరసత్వాలు వదులుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఈ రోజుల్లోనూ అమెరికాలో పిల్లలకు గ్రీన్ కార్డు దొరికితే వారి తల్లిదండ్రులు ఇక్కడ దావత్లు ఇస్తున్నారంటే మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొన్నారు. ఇక్కడ అన్నీ మంచిగా ఉంటే ఉన్న ఊరిని, కన్నవారిని వదిలిపెట్టి ఎవరైనా ఎందుకు పోతారు?’ అని సీఎం ప్రశ్నించారు.
గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటీ రాలేదు. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటీ రాలేదు. గిరిజన యూనివర్సిటీ రాలేదు. ఇంకా చాలా రాలేదు. తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏపీ ఖాతాలో వేసింది. వాటిని మాకు ఇప్పించాలని ఏడేండ్ల నుంచి కేంద్రాన్ని అడుగుతున్నా ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించలేదు. ఇది ప్రజాస్వామ్యమా? ఫెడరల్ స్ఫూర్తా? ఇది దేనికి సంకేతం? ఇంకా ఎక్కువ అడిగితే ఉల్టా మాట్లాడుతూ ఇయ్యంగాక ఇయ్యం.. ఏం చేసుకొంటరో చేసుకో పోండి అని మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడికొచ్చిందో తెలుసు కదా? ఇంత మితిమీరిన అహంకారం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకు దిక్కులేదు. మంచినీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, సాగు నీళ్లు ఉండవు.. ఇదీ కేంద్ర పాలకుల చరిత్ర. రత్నగర్భలాంటి దేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేసేలా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇలా చేయలేదని పేర్కొన్నారు. ‘మిగిలిన రాష్ర్టాలు తియ్యగ, పుల్లగ మాట్లాడి వదిలేస్తే.. మేము మాత్రం అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుకొన్నాం. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించాం. ఏ దళిత సమాజాన్ని వివక్షకు గురి చేశామో, వందల సంవత్సరాలు వారిని బాధపెట్టామో.. వాళ్ల కోసం పోరాడి, వాళ్ల కోసం సిద్ధాంతాలు తెచ్చిన ఆ మహనీయుని పేరును భారత పార్లమెంట్కు పెట్టాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదు. ఇక సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తామంటున్న వాళ్ల సంగతి ప్రజలే చూసుకొంటారు. కూలకొడితే కాళ్లు రెక్కలు ఇడిచి పడేస్తారు’ అని హెచ్చరించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు అత్యంత అసహ్యంగా ఉన్నది. దేశం నేడు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నది. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరవడమనేది దేశానికి అతిపెద్ద సమస్య. కోట్ల మంది ప్రజలకు సంబంధం ఉన్న అత్యంత ప్రాధాన్య విషయంపై చర్చించకుండా, దానిని చీకట్లో పెట్టి ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం దారుణం. నువ్వు నా కన్నా పెద్ద షుంటవు అంటే.. నువ్వే నా కన్నా పెద్ద షుంటవు.. నువ్వెన్ని ప్రభుత్వాలను కూల్చేశావంటే.. నువ్వెన్ని కూల్చేసావంటూ నిందలు వేసుకొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. లేదంటే దేశానికి ఎలాంటి మేలు జరగదు.
దేశ ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టిన అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.‘అదానీ సంగతేంది? దేశం ఉంటదా? చస్తదా? అనే అంశంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 1853 నుంచి ప్రచురిస్తున్న ‘ది ఎకనమిస్ట్’ అనే పత్రికలో ‘ది ఫారెబుల్ ఆఫ్ అదానీ. ది హంబ్లింగ్ ఆఫ్ ఏ టైకూన్ ఈజ్ ఏ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం’ అనే వ్యాసం రాశారు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం నేపథ్యంలో ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతున్నదనేది ఈ వ్యాసం సారాంశం. ఈ పరిస్థితుల్లో దేశం ఏం చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ గానీ, కాంగ్రెస్ గానీ, మరో పార్టీ గానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదానీ గురించి ప్రధానమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవడం అత్యంత దారుణం. కనీసం దేశం కోసమైనా ఆయన మాట్లాడాల్సి ఉండె. కమిటీ వేస్తామనో, ఇంకేదైనా చేస్తామనో చెప్పి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది. ఈ దేశంలో పెట్టుబడులు పెడదామా.. వద్దా? ఇక్కడి వ్యవస్థలు, ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని అంతర్జాతీయ మదుపరులు చూస్తున్నారు. వాళ్లు మన దేశాన్ని థర్డ్ క్లాస్ దేశంగా చెప్పారంటే దేశం పనైపోతుంది. ఎన్ని అక్రమాలైనా చేయోచ్చు.. తప్పించుకోవచ్చనే అహంకారం మంచిదికాదు. హిండెన్బర్గ్ నివేదికతో ఒక్క దెబ్బకే (అదానీ గ్రూప్) రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ సంస్థ ఉంటదో, మునుగుతదో తెలువదు. ఆ కంపెనీల్లో అనేక బ్యాంకులతో పాటు ఎల్ఐసీ కూడా పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీకి 25 కోట్ల మంది డిపాజిటర్లు ఉన్నారు. ఇప్పుడు వారందరికీ భయం పట్టుకొన్నది. కానీ ప్రధాని నోటి నుంచి మాత్రం అదానీకి సంబంధించి ఒక్క మాట కూడా రాలేదు. దోస్త్ కథంతా బయటపడిందనే ఆక్రోశం మాత్రం మోదీ లోపల ఉన్నది’ అని సీఎం మండిపడ్డారు.
దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుస్తున్నాయని, కానీ ప్రజలు ఓడిపోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ప్రజలేమో పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. పరిశ్రమలు మూతపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. 2014లో కాంగ్రెస్ బాగాలేదని, మోదీ ఏదో చేస్తారని అధికారం అప్పగిస్తే ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది. 2014 ఎన్నికల్లో మోదీ గెలిచారు. బీజేపీ గెలిచింది. కానీ భారతదేశ ప్రజలు ఓడిపోయారు. దేశ ప్రజల ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ రూ.13.27 లక్షల కోట్లు. కానీ కేంద్రంలో ప్రధానమంత్రిగా మోదీ స్థానంలో మన్మోహన్సింగ్ ఉన్నా, తెలంగాణ మాదిరిగా దేశాన్ని పరిపాలించినా తెలంగాణ జీఎస్డీపీ రూ.16 లక్షల కోట్లు ఉండాలి. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే రూ. 3 లక్షల కోట్లు నష్టపోయింది. మన్మోహన్సింగ్ హయాంతో పోల్చితే మోదీ హయాంలో దేశం ప్రతిరంగంలో వెనుకబడిపోయింది. ఘోరంగా దెబ్బతిన్నది. ఓవైపు దివాలా తీసుకొంటూ.. మరోవైపు మేమే గొప్పోళ్లమంటున్నారు. 2014లో కాంగ్రెస్ పనికిరాకుండా పోయింది కాబట్టి మోదీ గెలిచారు. మన్మోహన్సింగ్ను బద్నాం చేశారు. ఆయన మంచి వ్యక్తి. పని ఎక్కువ చేస్తారు. ప్రచారం తక్కువ చేసుకొంటారు. మోదీకన్నా చాలా ఎక్కువ పని చేశారు. కానీ చెప్పుకోలేదు. మన్మోహన్సింగ్ ఏం చేయలేదని బీజేపీ వాళ్లు లొల్లి చేసి.. మేం ఏదో చేస్తామని దేశాన్ని నమ్మించారు. ఇవన్నీ నేను చెప్పింది కాదు. సీనియర్ ఆర్థికవేత్త, జర్నలిస్టు పూజా మెహ్రా ‘లాస్ట్ డికేడ్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ఇందులో వాస్తవాలన్నీ ఉన్నాయి’ అని సీఎం తెలిపారు.