హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ (ఎల్ఏడీసీఎస్) కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. గురువారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఎల్ఏడీసీఎస్ కేంద్రాలను హైకోర్టు నుంచి వర్చువల్ విధానంలో ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ నవీన్రావు ప్రారంభించారు.
నిరుడు ఫిబ్రవరి 3న తొలిదశగా 16 జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ పీ నవీన్రావు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన 16 న్యాయ సహాయ కేంద్రాల్లో నాలుగు నెలల కాలంలో 824 కేసులకుగాను 104 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. కొత్త కేంద్రాల ద్వారా క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయసహాయం లభిస్తున్నదని చెప్పారు. ఈ కేంద్రాల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిళ్ల (న్యాయవాది)ను నియమించినట్టు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ చాలా మంది విచారణ ఖైదీలు జైళ్లలో ఉన్నారని, వారిలో పేదలకు, బలహీనవర్గాలకు న్యాయం అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
క్రిమినల్ కేసుల్లో నిందితుల అరెస్టుకు ముందే ఎలాంటి దరఖాస్తు లేకపోయినా న్యాయం అందజేసేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. జిల్లా జడ్జీలు జైళ్లను తనిఖీ చేసి ఖైదీల సాదకబాధలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నిస్థాయిల్లోనూ సంపూర్ణంగా సహకారం ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.