హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించినట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం తెలిపారు. తమ ప్రోత్సాహంతో 2023లో అనేక మంది గ్రామీణులు కొత్త ఆవిష్కరణలు రూపొందించారని, వాటిలో 100 మంది గ్రామీణుల ఆవిష్కరణలు గుర్తించి, వారికి అవార్డులను అందజేశామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
జనవరి 26న, ఏప్రిల్లో టీ-మహోత్సవ్ను గ్రామ పంచాయతీల్లో, 33 జిల్లాల్లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. టీ హబ్తో కలిసి సోషల్ ఇన్క్లూజివ్ ఇన్నోవేషన్, 10 ఎక్స్ ఎస్ఐజీ వంటి కార్యక్రమాలను 2023లో విజయవంతంగా జరిపినట్టు పేర్కొన్నారు. టీఎస్ఐసీ ఇంటింటి ఇన్నోవేటర్ ద్వారా 2019లో ఎంపికైన గ్రామీణ ఆవిష్కర్త గొర్రె అశోక్ ఈ ఏడాది అమెరికాలో నిర్వహించిన ‘ అమెరికన్ సొసైటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోలాజికల్ ఇంజినీర్స్’ సదస్సులో పాల్గొన్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో మహీంద్ర రైజప్ కార్యక్రమంలో గొర్రె అశోక్ రూపొందించిన ఆవిష్కరణకు గుర్తింపు దక్కిందని గుర్తుచేశారు.