హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లను స్వీకరిస్తారని, 26 నుంచి స్క్రూటినీ మొదలవుతుందని, 29లోపు నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు.
మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయని వివరించారు. తొలిరోజైన గురువారం 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లను దాఖలు చేశారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లలో 3,31,48,527 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటర్లలో 1,64,88,170 పురుషులు, 1,66,57,605 మహిళలు ఉన్నారని, లింగ నిష్పత్తి 1,010గా నమోదైనట్టు తెలిపారు.
రాష్ట్రంలో 18-19 ఏండ్ల యువ ఓటర్లు 9,01,942 మంది, 1,93, 641 మంది సీనియర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ఏప్రిల్ 25 నాటికి యువ ఓటర్ల సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చని తెలిపారు. ప్రతి ఇంట్లో ఆరుకంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇండ్లకు వెళ్లి 3.87 లక్షల మంది ఓట్లను పరిశీలించామని, కొన్నిచోట్ల చిరునామా సరిగా లేవని గుర్తించనట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి లెవల్ పరిశీలన పూర్తయిందని, మొదటి దశలో నిర్దేశించిన ప్రాంతాలకు ఈవీఎంలను తరలిస్తున్నారని, బ్యాటరీలు, సీల్స్, పేపర్రోల్స్ అన్నీ సరఫరా చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నాటి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు రూ.136.7 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఇతర ఉచితాలు పట్టుబడినట్టు వెల్లడించారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోసం 160 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని వికాస్రాజ్ తెలిపారు. వీటిల్లో 60 కంపెనీలు ఇప్పటికే తెలంగాణకు వచ్చాయని, 100 కంపెనీల బలగాలు రావాల్సి ఉన్నదని చెప్పారు. వీటికి తోడు సరిహద్దు రాష్ర్టాల నుంచి 20 వేల మంది పోలీసులను తీసుకుంటామని, మరో 60 వేల మంది ఇతర పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వికాస్రాజ్ తెలిపారు. ఇప్పటివరకు ఎంసీసీ కింద 4,099 ఎఫ్ఐఆర్లు ఐపీసీ, ఎక్సైజ్ యాక్ట్ ద్వారా నమోదు చేశామని వెల్లడించారు. ఎంసీసీ ఉల్లంఘనపై కేసీఆర్ రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, వారే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారని వికాస్రాజ్ వెల్లడించారు. సివిజల్ ద్వారా 877, టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా 230 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు.
వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు వికాస్రాజ్ తెలిపారు. తాగునీరు, కుర్చీలు, టెంట్లు వేయాలని చెప్పారు. 26 నుంచి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన మొదటిరోజే 42 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 8 మంది, నల్లగొండ, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో 4 చొప్పున, భువనగిరి, వరంగల్, చేవేళ్లలో ముగ్గురు చొప్పున, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో ఇద్దరు చొప్పున, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్లో ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు.