Chicken Price | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హాలిడే వచ్చిందంటే సరదాగా గడిపే నగరవాసుల భోజనంలో చికెన్, మటన్ ముక్కలు ఉండాల్సిందే! అయితే కార్తిక మాసంలో సహజంగానే కోళ్లు, చికెన్ ధరలు తగ్గాయి. ఇప్పుడు కార్తికం ముగియడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గురువారం నుంచి ధరలు పెరుగుతున్నాయి. కార్తిక మాసంలో కిలో చికెన్ ధర గరిష్ఠంగా రూ.180 ఉండేది. ఆదివారం ఒక్కసారిగా రూ.220-240కి చేరింది. మొబైల్ యాప్లలోనైతే రూ.250-280కి విక్రయిస్తుండటం నివ్వెరపరుస్తున్నది.
ఒక్కసారిగా పెరిగిన ధర
రిటైల్ మార్కెట్లో ధరలు కూడా అధికమయ్యాయి. వారం క్రితం కిలో చికెన్ ధర రూ.150-180గా ఉండేది. ఇలా ఒక్కో కిలోపై రూ.80-90 పెరిగి, ఆదివారం కిలో రేట్ రూ.220-240కి చేరింది. బాయిలర్ చికెన్తోపాటు దేశీకోడి కూడా ఒక్కో కిలో మాంసాన్ని రూ.100-150 ఎక్కువకు విక్రయించారు.
ఆన్లైన్లోనూ అధిక రేట్లు
కొంతకాలంగా హైదరాబాద్లో ఆన్లైన్ వేదికగా మాంసం క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీకెండ్లో సరేసరి. కార్తిక మాసంలో ఆఫర్లతో ఆకట్టుకున్న ఈ-కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్ల నిర్వాహకులు ఇప్పుడు ఆఫర్ల జోలికి వెళ్లకుండా ఉండటమే కాక ధరలు పెంచేశాయి. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.200 ఉంటే మొబైల్ యాప్లలో క్వాలిటీ పేరిట రూ.250-280 క్రయవిక్రయాలు జరుపుతున్నారు. కార్తిక మాసంలో ఓ మాంసం విక్రయ సంస్థ ఏకంగా 50 శాతం డిస్కౌంట్ సేల్స్ నిర్వహించగా, ఇప్పుడు అదే ఫ్లాట్ఫారంలో డెలివరీ చార్జీలతో కలిపి కిలో చికెన్ రూ.310కి లభిస్తున్నది.
పెండ్లిళ్లు, పండుగల సీజనూ కారణమే
చికెన్ ధరల విషయంలో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.1000 పలుకుతున్నది. కార్తిక మాసం ముగిసి పెండ్లిళ్ల సీజన్ మొదలయ్యింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సమీపిస్తుండటంతో చికెన్ ధరలకు అమాంతం రెక్కలొస్తున్నాయి. కోడిగుడ్ల ధరలు కూడా పెరుగుతుండటం గమనార్హం. కోళ్లఫారం నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో హోల్సేల్ ధరలూ గణనీయంగా పెరుగుతాయని టాక్. ఈ పరిణామం వచ్చే మూడు నెలలపాటు చికెన్ ధరలను ప్రభావితం చేస్తాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.