తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన ధర
నెలలోనే పెరిగిన రూ.100
వేసవిలో ధరల సెగ తప్పదంటున్న వ్యాపారులు
హైదరాబాద్, మార్చి 6 : చికెన్ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతున్నది. మటన్ ధరలు కొండెక్కి కూర్చుండగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైంది. నెల కిందటి వరకు రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. ఆదివారం ఏకంగా కిలో చికెన్ ధర రూ.290 పలికింది. నెల వ్యవధిలోనే ఏకంగా రూ.100కి పైగా పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయానికి కిలో కోడి కూర ధర రూ.200 మాత్రమే ఉన్నది. ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. కరోనా ప్రభావం, దాణా ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. కిలో మటన్ ధర రూ.750 నుంచి రూ.900 వరకు పలుకుతున్నది.
సాధారణంగానే ప్రతి వేసవిలో చికెన్ ధరలు పెరుగుతాయి. ఎండలకు కోళ్లు చనిపోవడం, రైతులు తక్కువగా పిల్లల్ని వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రస్తుత ధరలు వేసవిలో ఉండాల్సినదానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వేసవి మొత్తం చికెన్ ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇటీవల మక్కజొన్న, సోయాబీన్ ధరలు భారీగా పెరగడంతో దాణా ఖర్చు రెట్టింపు అయ్యిందని, దాన్ని భరించలేక రైతులు కోళ్ల పెంపకాన్ని మానేస్తున్నారని వివరించారు. దీంతో ఉత్పత్తి తగ్గుతున్నదని, ఈ ప్రభావం ధరలపై ఉన్నదని పేర్కొన్నారు.