ములుగు, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం మహా జాతరలో బాలికపై ఛత్తీస్గఢ్ యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగు దాటిన తరువాత అమ్మవార్ల గద్దెల వైపు వెళ్లే దారిలో కుడివైపు ఉన్న మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
జాతర సమయంలో చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన బాలిక వాష్రూమ్కు వెళ్లిన క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్నకు పాల్పడినట్టు సమాచారం. వాష్రూమ్కు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. అక్కడ దొరికిన యువకులను పట్టుకొని కుటుంబ సభ్యులు చితకబాదడంతో ఐదుగురిలో కొందరు పరార్ కాగా మరికొందరిని పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది.
ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభుత్వ యంత్రాంగం మేనేజ్ చేసినట్టు సమాచారం. ఘటన జరిగిన తరువాత వందల మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. జాతరలో నిజంగానే బాలికపై లైంగిక దాడి జరిగిందా? జరిగితే అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? అసలు కారణాలు ఏమిటి? నిందితులు ఛత్తీస్గఢ్కు చెందిన వారేనా? అనే విషయాలపై పోలీసులు నిజానిజాలు తేల్చాల్సి ఉన్నది.