చేర్యాల, డిసెంబర్ 26: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా తలకు తీవ్ర గాయం కావడంతో కిందపడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందారు. పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు. హత్యకు కారణమైన ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెంటనే చేర్యాల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. జడ్పీటీసీ మృతదేహాన్ని గ్రామానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్ శ్వేత, అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్సై భాస్కర్రెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, నిత్యం ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.