జనగామ చౌరస్తా, మే 27: అద్భుతమైన కళాకృతులకు రూపమిస్తూ.. కుంచెలోని రంగులతో వాటికి ప్రాణంపోస్తూ.. అందమైన చిత్రాలతో ఆలోచనాత్మక ‘లోగో’లు సృష్టిస్తూ తెలంగాణ యవనికపై ఇప్పుడిప్పుడే వెలుగొందుతున్న చిత్రకారుడు చేర్యాల రవిశంకర్. తెలంగాణ సమాజం 21 రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకోబోతున్న ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు’ సంబంధించి సీఎం కేసీఆర్ ఇటీవల ఆవిష్కరించిన ‘లోగో’ సృష్టికర్త ఆయనే. తెలంగాణ అస్తిత్వం, పదేండ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం ప్రతిబింబించేలా రవిశంకర్ ఈ ‘లోగో’ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రోత్సాహంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ చేత ‘భళా’ అనిపించుకొన్నారు. ఇదొక్కటే కాదు ప్రపంచ తెలుగు మహాసభలు, బతుకమ్మ సంబురాలు, కేసీఆర్ కిట్, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్, తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయ్బిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవెలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రైతుబంధు సమితి, దివంగత మాజీ ప్రధాని పీవీ శత జయంత్యుత్సవాలకు ‘లోగో’ రూపకల్పన చేసింది రవిశంకరే. గజ్వేల్, సిద్దిపేటలో ఉన్న ‘మహతి’, ‘విపంచి’ కళా నిలయాలకు అద్భుతమైన డిజైన్స్ను కూడా రవిశంకర్ రూపొందించారు. తెలంగాణలో ‘లోగో’ రూపకల్పనకు కేరాఫ్ అడ్రస్గా రవిశంకర్ మారారు. దీంతో చేర్యాల రవిశంకర్ను అందరూ ‘లోగో’ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలుచుకుంటున్నారు. రవిశంకర్ స్వగ్రామం జనగామ మండలంలోని ఓబుల్ కేశవాపూర్. ప్రస్తుతం హైదరాబాద్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ‘స్కేర్ మీడియా వర్క్స్’ పేరిట సొంతంగా యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు.